యువత ఓటరు నమోదు చేయించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ పిలుపునిచ్చారు. 2011 జనాభా గణాంకాల ప్రకారం జిల్లాలో...
=వచ్చే నెల 10వ తేదీ వరకు నమోదు, సవరణ
=16న జాబితా తుది ప్రచురణ
=రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్
విశాఖ రూరల్, న్యూస్లైన్: యువత ఓటరు నమోదు చేయించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ పిలుపునిచ్చారు. 2011 జనాభా గణాంకాల ప్రకారం జిల్లాలో 1.71 లక్షలు యువతీ, యువకులు ఉంటే వారిల 25 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండే ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. యువతలో అవగాహన కలిగించేందుకు జిల్లా అధికారులు కళాశాలల్లో సమావేశాలను నిర్వహిస్తారని వివరించారు. డిసెంబర్ 10వ తేదీ వరకు ఓటరు నమోదు, సవరణ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. జనవరి 16న ఓటర్ల జాబితా తుది ప్రచురణ ఉంటుందని స్పష్టం చేశారు.
2 కిలోమీటర్లలోపే పోలింగ్ కేంద్రం
ఎన్నికల నిబంధన ప్రకారం ఓటరుకు రెండు కిలోమీటర్లులోపే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని భన్వర్లాల్ చెప్పారు. దీనిలో భాగంగా జిల్లాలో కొత్తగా 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలో ఇప్పటికీ పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్నాయన్న విషయాన్ని రాజకీయ పార్టీలు ప్రస్తావించాయని, అటువంటి పరిస్థితులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు, ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఏజెన్సీపై దృష్టి పెట్టాలి : ఏజెన్సీలో పాడే రు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటరు నమోదు శాతం తక్కువగా ఉందని ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారు. ఆయా ప్రాంతాలపై దృష్టి పెట్టి ఓటరు నమోదు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడి వారు వారానికి ఒక రోజు సంతలకు వస్తారని ఆయా రోజుల్లో సంతల వద్దే ఓటరు దరఖాస్తులను అందించి నమోదు చేయించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.
బీఎల్ఏలను నియమించాలి
ఈ నెల 24, డిసెంబర్ 1, 8 తేదీల్లో జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లోను ఉదయం 10 నుంచి 5 గంటల వరకు ఎన్నికల యంత్రాంగం నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆయా తేదీల్లో ప్రజలు ఓటరు నమోదు, సవరణలు చేసుకోవచ్చని సూచించారు. బీఎల్ఓలతో పాటు రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాల్సి ఉందని, అయితే చాలా పార్టీలు బీఎల్ఏలను నియమించలేదని చెప్పారు. ఇప్పటికైనా పార్టీలు బీఎల్ఏలను నియమించాలన్నారు.
ఎకనాలెడ్జ్మెంట్ తప్పనిసరి
ఓటరు నమోదు చేయించుకున్న వారు తప్పనిసరిగా ఎకనాలెడ్జ్మెంట్ తీసుకోవాలని సూచించారు. దాని ద్వారా నమోదు జరగకపోతే అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ నెల 18న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురించడం జరిగిందని, ఓటర్లు వాటిలో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలన్నారు. తప్పులు ఉంటే ఫారం నెంబర్-8 ఇచ్చి సవరణ చేసుకోవాలన్నారు. ఠీఠీఠీ.ఛిౌ్ఛ్చఛీజిట్చ.జీఛి.జీ వెబ్సైట్లో కూడా ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవచ్చన్నారు. ఓటరు నమోదుకు ప్రజలు జనన, చిరునామా ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలన్నారు. చిరునామా లేనిపక్షంలో దరఖాస్తు చేసుకోవచ్చని, అటువంటి వాటిని బీఎల్ఓను స్వయంగా ఇంటికి వచ్చి పరిశీలిస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సాల్మన్ఆరోఖ్యరాజ్, జిల్లా ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్ పాల్గొన్నారు.