ఇంటికొస్తున్నానని భార్యకు చెప్పిన భర్త ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి కానరానిలోకాలకు వెళ్లిన ఘటన...
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
అనంతపురం క్రైం : ఇంటికొస్తున్నానని భార్యకు చెప్పిన భర్త ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి కానరానిలోకాలకు వెళ్లిన ఘటన అనంతపురం రైల్వేస్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని రెవెన్యూ కాలనీకి చెందిన దస్తగిరిబాబు (23) ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా జమ్ములమడుగుకు చెందిన దస్తగిరిబాబుకు ఏడాదికిందట అనంతపురం నగరానికి చెందిన ఆషాతో వివాహమైంది. ఈమె ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. దస్తగిరిబాబు తరచూ బెంగళూరుకు వెళ్లి ఎలక్ట్రికల్ సామాన్లు కొనుగోలు చేసేవారు.
ఈ క్రమంలో బెంగళూరుకు వెళ్లిన ఆయన మంగళవారం రాత్రి యశ్వంత్పూర్-బీదర్ ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరారు. భార్య ఆశాకు ఫోన్చేసి ఊరికి వస్తున్నానని చెప్పారు. ఈ రైలు అనంతపురం రైల్వేస్టేషన్కు అర్ధరాత్రి సమయంలో చేరుకుంది. ఇక్కడ స్టాపింగ్ లేదు. దీంతో దస్తగిరిబాబు వెళ్తున్న రైలు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశాడు. ఈ పరిస్థితుల్లో అదుపుతప్పి కిందకు జారి పడ్డారు. తలకు బలమైన గాయమై ప్రాణాలొదిలారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హెడ్కానిస్టేబుల్ నాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.