‘పదవిలో ఉండి పేకాట క్లబ్బులు నడుపుతున్నారు’
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబుబు నాయుడి వంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండడని బీజేపీ ఏలూరు లోక్సభ అభ్యర్థి డాక్టర్ చిన్నం రామకోటయ్య విమర్శించారు. కృష్ణాజిల్లా నూజివీడులో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని అకాంక్షిస్తూ శనివారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూజివీడుకు రాజధాని రాకుండా ఇక్కడి ప్రజలను నిట్టనిలువునా ముంచిన నయవంచకుడు చంద్రబాబు నాయుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలో రైతుల వద్దనుంచి వ్యవసాయ భూములను బలవంతంగా తీసుకుని పనికిరాని నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు అధికారికంగా ఒక్కభవనం నిర్మాణం కూడా నిర్మించలేదని మండిపడ్డారు. ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబు పదవిని అడ్డం పెట్టుకుని పేకాట క్లబ్బులు నడుపుతున్నారని రామకోటయ్య విమర్శించారు. ఏపీలో అమలయ్యే సంక్షేమ పథకాలన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు.