సిండికేట్‌పై పత్తి రైతుల ఆగ్రహం | Wrath of cotton farmers on syndicate | Sakshi
Sakshi News home page

సిండికేట్‌పై పత్తి రైతుల ఆగ్రహం

Jan 21 2014 4:41 AM | Updated on Sep 2 2017 2:49 AM

వ్యాపారులు సిండికేట్‌గా మారి అన్యాయం చేస్తున్నారని పెద్దపల్లిలో పత్తి రైతులు సోమవారం రోడ్డెక్కారు. రాజీవ్హ్రదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

పెద్దపల్లి రూరల్, న్యూస్‌లైన్ : వ్యాపారులు సిండికేట్‌గా మారి అన్యాయం చేస్తున్నారని పెద్దపల్లిలో పత్తి రైతులు సోమవారం రోడ్డెక్కారు. రాజీవ్హ్రదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ  రెండు బస్తాలు తెచ్చిన వారికి ఎక్కువ రేటు చెల్లించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటూ ట్రాక్టర్లలో పత్తి తెచ్చిన రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంట్లో  ఆంతర్యమేంటని  ప్రశ్నించారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి అన్యాయం చేస్తున్నా, మార్కెటింగ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటపాటు రాస్తారోకో చేయడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై కిశోర్ వచ్చి రైతులను సముదాయించారు. గతంలో జరిగిన చెల్లింపులను పరిశీలించి, అధికారులు, వ్యాపారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

ఎస్సై కిషోర్ రికార్డులను పరిశీలించి అధికారులు, వ్యాపారులతో మాట్లాడారు. రైతులకు నష్టం కలగకుండా చూడాలన్నారు. అనంతరం కొనుగోళ్లు జరిగాయి. ఆందోళనలో గుర్రాంపల్లి గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాసరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు తాడూరి శ్రీమాన్, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement