బాసరలో శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురి దారుణహత్య.. మంచిర్యాలలో శనివారం అర్ధరాత్రి ఇద్దరి హతం.. 24 గంటల్లోనే ఐదుగురు హత్యకు గురయ్యారు.. ఈ రెండు సంఘటనల్లో అగంతకులు కత్తులు, గునపాలు, ఇనుపరాడ్లు వాడినట్లు తెలుస్తోంది.. హతుల తలపైనే బలంగా గాయపరిచారు.. ఛిద్రమయ్యేలా బాదారు.. రెండు సంఘటనలు తూర్పు, పశ్చిమ జిల్లాల్లో కలకలం రేపాయి.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బాసరలో శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురి దారుణహత్య.. మంచిర్యాలలో శనివారం అర్ధరాత్రి ఇద్దరి హతం.. 24 గంటల్లోనే ఐదుగురు హత్యకు గురయ్యారు.. ఈ రెండు సంఘటనల్లో అగంతకులు కత్తులు, గునపాలు, ఇనుపరాడ్లు వాడినట్లు తెలుస్తోంది.. హతుల తలపైనే బలంగా గాయపరిచారు.. ఛిద్రమయ్యేలా బాదారు.. రెండు సంఘటనలు తూర్పు, పశ్చిమ జిల్లాల్లో కలకలం రేపాయి. ఇప్పటికే జిల్లాలో వరుస దొంగతనాలతో జనం బెంబేలెత్తుతుండగా, అగంతలకు ఐదుగురిని దారుణంగా హతమార్చి పోలీసులకు సవాల్ విసిరారు. చెలరేగుతున్న దోపిడి దొంగలు, మాఫియా పోలీసులకు తలనొప్పిగా మారింది.
బాసరలో శుక్రవారం రాత్రి అశోక్స్వామి, అతని భార్య సువర్ణ, పెద్ద కుమారుడు మణికంఠలను హత్య చేసిన అగంతకులు, చిన్న కుమారుడు శరత్చంద్రను తీవ్రంగా గాయపరిచారు. అయితే ఈ సందర్భంగా అగంతకులు మరాఠిలో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మంచిర్యాల శ్రీశ్రీనగర్లో శనివారం రాత్రి హత్యకు గురైన దేవి దుర్గమ్మ(55), దేవి రవీందర్ (25) ఇదే తరహాలో దుండగులు కత్తులు, గునపాలు వాడటం చర్చనీయాంశం అవుతోంది. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ రెండు సంఘటనలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
మహారాష్ట్ర ముఠా పనే?.. ఎస్పీ త్రిపాఠి ఆరా..
బాసర, మంచిర్యాలలో జరిగిన రెండు సంఘటనలు, ఐదుగురి హత్య మిస్టరీగా మారింది. వేర్వేరుగా జరిగిన ఈ సంఘటనల్లో అసలు హంతకులు ఎవరనేది పోలీసులకు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో ప్రత్యేకత ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయ సమీపంలో జరిగిన ముగ్గురి హత్యపై పోలీసులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. బాసరలో హత్య చేసిన అగంతకులు మరాఠిలో మాట్లాడినట్లు పోలీసు ప్రాథమిక విచారణలో తేలింది. హంతకుల ఆచూకీ కోసం రంగంలోకి డాగ్ స్క్వాడ్ మహారాష్ర్ట వైపు వెళ్లే రైలు మార్గాల వెంట తిరగడం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీముల ద్వారా పోలీసు ఉన్నతాధికారులు కొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఇదిలా వుండగా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదివారం బాసరకు చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. సంఘటనా స్థలాన్ని చేరుకుని అక్కడ పనిచేస్తున్న కొందరిని అడిగి తెలుసుకున్నారు. ముగ్గురి హత్యకు కారణమైన సంఘటనపై వివరాలు తెలుసుకున్న ఎస్పీ త్రిపాఠి భైంసా సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో వేర్వేరుగా జరిగిన సంఘటనలపైనా తీవ్రంగా స్పందించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లో కేసు మిస్టరీని ఛేదించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కాగా అశోక్స్వామి కుటుంబం హత్య వెనుకు మహారాష్ర్టకు చెందిన దొంగల ముఠా పనా? లేక వేరేవరైనా ఆ అఘాయిత్యానికి ఒడి గట్టారా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మంచిర్యాల ఘటనపై కూడా ఎస్పీ త్రిపాఠి పోలీసు అధికారులను విచారణకు ఆదేశించారు.
ఐదేళ్లలో రికవరీ అంతంతే..
జిల్లాలో దొంగలు విజృంభిస్తుంటే పోలీసులు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారు. ఐదేళ్లుగా కేసుల రికవరీలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2008లో 380 దొంగతనం కేసులు నమోదైతే, 2009లో 310, 2010లో 285, 2011లో 309 కేసులు నమోదైనట్లు రికార్డులు చెప్తున్నాయి. అలాగే 2008లో 3 డెకాయిట్, 2009లో 6, 2010లో 4, 2011లో 3, రాబరీ కేసులు 2008లో 20, 2009లో 19, 2010లో 15, 2011లో 9, 2012లో 7 కేసులు నమోదుకాగా ఆ కేసుల్లో పోలీసులు సాధించిన ప్రగతి అంతంత మాత్రమే. జిల్లా వ్యాప్తంగా 2008లో మొత్తం కేసులు 4,898 నమోదు కాగా, 2009లో 4,923, 2010లో 4,598, 2011లో 4,672, 2012లో 4,538 నమోదైన ట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 45 శాతానికి పైగా కేసులు పరిష్కారానికి నోచుకోలేదు. 2009లో సుమారుగా రూ.1.39 కోట్లు చోరీకి గురికాగా రూ. 94.05 లక్షలు రికవరీ అయ్యాయి. 2010లో రూ.1.68 కోట్లకు రూ.89.47 లక్షలు, 2011లో రూ. 2.82 కోట్లకు రూ.1.30 కోట్లు, 2012లో 2.46 కోట్లకు రూ.1.84 కోట్లు రికవరీ కాగా రూ.46.46 శాతం మాత్రమే బాధితులకు అందింది