విశాఖ మహా నగరం మరి కొద్దిరోజుల్లోనే నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్లతో అభివృద్ధి చెందనుందని...
♦ వేగవంతంగా ప్రాజెక్టులకు అనుమతి
♦ త్వరలో 2 వేల కొత్త బస్సులు
♦ రహదారుల అభివృద్ధికి చర్యలు
♦ అమెరికన్, నేషనల్ పెట్రోలియం యూనివర్సిటీలు రాక
♦ స్మార్ట్ సిటీ సదస్సులో ఎంఏయూడీపీఎస్ గిరిధర్
విశాఖపట్నం సిటీ : విశాఖ మహా నగరం మరి కొద్దిరోజుల్లోనే నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్లతో అభివృద్ధి చెందనుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎ.గిరిధర్ అన్నారు. నగరంలోని ఓ హోటల్ లో శుక్రవారం కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసి న స్మార్ట్ సిటీ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఓ చిన్న మత్స్యకార పల్లెగా ఉన్న విశాఖ ఇప్పుడు సకల రవాణా మార్గాలతో అధునాతన నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటైన తర్వాత నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. స్నేహపూర్వకంగా, సంప్రదాయబద్ధంగా ఎంతో హుందాగా ఇక్కడి ప్రజలు వ్యవహరిస్తుంటారని చెప్పారు.
నగరంలో త్వరలోనే 24 గంటలూ నీరు, విద్యుత్, సివరేజ్ ట్రీట్మెంట్, ఇతర సదుపాయాలన్ని రానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాజెక్టులకు అనుమతిలిచ్చే ప్రక్రియను వేగవంతం చేసినట్టు వెల్లడించారు. గతంలో 21 రోజులు సమయం పడితే ఇప్పుడు కేవలం ఏడు రోజుల్లోనే అనుమతిస్తున్నట్టు స్పష్టం చేశారు. మెట్రో, బీఆర్టీఎస్తో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. త్వరలోనే విశాఖకు 1800 నుంచి 2 వేల కొత్త బస్సులు రానున్నాయని చెప్పారు. నాణ్యమైన రోడ్లు, అమెరికన్ యూనివర్సిటీలు, నేషనల్ పెట్రోలియం యూనివర్సిటీలు రానున్నాయని చెప్పారు.
కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ విశాఖను స్మార్ట్ సిటీ చేసేందుకు అవసరమైన అనుమతులను త్వరితగతిన ఇస్తున్నట్టు చెప్పారు. అందమైన ఈ నగరం మరింత స్మార్ట్ కాబోతుందన్నారు. సీఐఐ ఏపీ చైర్మన్ చిట్టూరి సురేష్ మాట్లాడుతూ అన్ని స్మార్ట్ గ్రామాలయితే, త్వరలోనే స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అవుతుందన్నారు. స్థానిక నైపుణ్యతకు మెరుగుపెడితే మరిన్ని ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. యుఎస్ ఎంబసీ కమర్షియల్ కౌన్సిలర్ దిల్లాన్ బెనర్జీ మాట్లాడుతూ విశాఖలో ఉత్తమమైన పారిశ్రామిక సంస్థలే మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయన్నారు.
యుఎస్ ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాంతీయ సంచాలకుడు ెహ న్రీ స్టియంగాస్ మాట్లాడుతూ మొదటి సారి వైజాగ్కు వచ్చానని, నగరం చాలా బాగుందన్నారు. ఏయే సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయో వివరించారు. యుఎస్ కంపెనీస్ కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజయ్సింఘా, సీఐఐ వైస్ చైర్మన్ జీఎస్ శివకుమార్, ఐబీఎం ప్రతినిధి డాక్టర్ ప్రశాంత్ప్రధాన్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్, వుడా వైస్ చైర్మన్ డాక్టర్ టి.బాబూరావు నాయుడు ప్రసంగించారు.