పేపర్‌మిల్లు ఎదుట గ్రామస్తుల ఆందోళన | villagers concern ఇన్ front of paper mill | Sakshi
Sakshi News home page

పేపర్‌మిల్లు ఎదుట గ్రామస్తుల ఆందోళన

Feb 10 2014 12:08 AM | Updated on Mar 28 2018 10:59 AM

మండల పరిధిలోని సర్దార్‌నగర్ గ్రామ సర్పంచ్ నర్సింలుపై స్థానికంగా ఉన్న ఓ పేపర్‌మిల్లు యాజమాన్యం దాడి చేసిందని ఆరోపిస్తూ ఆ గ్రామస్తులు ఆదివారం ధర్నా చేశారు.

షాబాద్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని సర్దార్‌నగర్ గ్రామ సర్పంచ్ నర్సింలుపై స్థానికంగా ఉన్న ఓ పేపర్‌మిల్లు యాజమాన్యం దాడి చేసిందని ఆరోపిస్తూ ఆ గ్రామస్తులు ఆదివారం ధర్నా చేశారు. సర్పంచ్ నర్సింలు, గ్రామస్తులు చెప్పిన కథనం ప్రకారం.. సర్దార్‌నగర్‌కి సమీపంలో ఉన్న పేపర్ మిల్లు నుంచి దుమ్ము, దూళి అధికంగా వచ్చి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మిల్లు యజమానితో మాట్లాడేందుకు సర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లాడు.

 అయితే మిల్లు మేనేజర్ నాగేశ్వర్‌రావు తన సెక్యూరిటీ గార్డ్స్‌తో సర్పంచ్‌ను బయటకు గెంటివేయించారు. ‘నీవు సర్పంచ్ అయితే మాకేంది..? మా మిల్లు వద్దకు ఎందుకు వచ్చావంటూ’ దుర్భాషలాడటంతో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. మిల్లు నుంచి వచ్చే దుమ్ముతో తాగునీరు కలుషితమవుతోందని, తాము రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లును మూసివేయించాలని గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదన్నారు.

 సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మిల్లు మూసివేతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. గ్రామస్తులంతా కలిసి కంపెనీ గేటుకు తాళం వేయడంతో మిల్లులో పనులు నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు అక్కడినుంచి వెనుదిరిగారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement