పలు క్లినిక్‌లపై విజిలెన్స్‌ దాడులు

Vigilance attacks on Fake Clinic - Sakshi - Sakshi

ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్‌): అనధికారికంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్న వారిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీపీ ఆదేశాల మేరకు విజిలెన్స్‌ ఎస్పీ రామప్రసాదరావు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని పలుచోట్ల దాడులు నిర్వహించారు. ఐఎల్‌టీడీ సెంటర్‌లోని సాయిక్లినిక్‌పై విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యకిషోర్, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపాలకృష్ణ, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ కోమలి దాడులు నిర్వహించారు. ద్వారపూడి పీహెచ్‌సీలో కాంట్రాక్టు పద్ధతిలో హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పీఎస్‌ రంగప్రసాద్‌ అనధికారికంగా ఈ క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. ప్రిస్కిప్షన్‌ వినియోగంతోపాటు, పేరుకు ముందు డాక్టర్‌ అనే పదాన్ని సైతం వినియోగిస్తున్నాడు. 

అలాగే అనుమతులు లేకుండా లేబొరేటరీ నిర్వహిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. యాపిల్‌ డెంటల్‌ ఆసుపత్రి వైద్యులు ఎ.సత్యప్రసాద్, శైలజ ఇక్కడ కన్సల్టెంట్‌ నిర్వహిస్తూ మెడికల్‌ షాపు నడుపుతున్నారు. మెడికల్‌షాపులో ఫార్మాసిస్టు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని విజిలెన్స్‌ ఎస్పీ టి.రామప్రసాదరావు పరిశీలించారు. అనధికారికంగా క్లీనిక్‌ను నిర్వహిస్తున్న పీఎస్‌ రంగప్రసాద్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి జిల్లా వైద్య ఆరోగ్యాశాఖాధికారికి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అదే ప్రాంతంలో ప్రసాద్‌ చర్యవ్యాధుల ఆసుప్రతిని తనిఖీ చేశారు. అక్కడ పత్రాలు సక్రమంగా ఉన్నాయని ఎస్పీ రామప్రసాదరావు తెలిపారు. 

ధవళేశ్వరంలోనూ..
ధవళేశ్వరం: ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ వీధిలోని శ్రీ సద్గురు కాళీకృష్ణ సీతామహలక్ష్మి క్లినిక్‌పైనా శుక్రవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ సర్టిఫికెట్లపై ఆసుపత్రి వైద్యుడు రాజగోపాల్‌ గిరీష్‌ను విజిలెన్స్‌ ఎస్పీ టి.రాంప్రసాదరావు ప్రశ్నించారు. రాజగోపాల్‌గిరీష్‌కు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించగా వేరే వారి పేర్లు వస్తున్నాయన్నారు. వాటిపై దర్యాప్తు చేపడతామన్నారు. ఆయన వెంట విజిలెన్స్‌ సీఐ టి.రామ్మోహనరెడ్డి,  ధవళేశ్వరం పీహెచ్‌సీ వైద్యాధికారి సుధాకర్‌ తదితరులు ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. 

నకిలీ డాక్టర్‌ అరెస్టు
రాజమహేంద్రవరం క్రైం: విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, మెడికల్‌ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో నకిలీ డాక్టర్‌ను, అతడి సహాయకుడిని అరెస్ట్‌ చేశారు. టూ టౌన్‌ సీఐ రవి కుమార్‌ కథనం ప్రకారం.. ఐఎల్‌టీడీ సెంటర్‌లో శ్రీ సాయి క్లినిక్‌ నిర్వహిస్తున్న పీఎస్‌ రంగా ప్రసాద్, అతడి సహాయకుడు సుధీర్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. వీరిపై చీటింగ్, సెక్షన్‌ 2 ప్రైవేటు మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌ రూల్‌ 5 ప్రకారం కేసులు నమోదు చేసినట్టు టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి కుమార్‌ తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top