తగ్గని కూర‘గాయాలు’ | vegetables prices still too high | Sakshi
Sakshi News home page

తగ్గని కూర‘గాయాలు’

Sep 16 2013 1:28 AM | Updated on Sep 1 2017 10:45 PM

కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ ధరలు ఇప్పుడప్పుడే దిగివచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. పెరిగిన ధరలతో గత రెండు నెలలుగా సామాన్య, మధ్యతరగతి జీవులు అవస్థలు పడుతున్నారు.


 జోగిపేట, న్యూస్‌లైన్:
 కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ ధరలు ఇప్పుడప్పుడే దిగివచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. పెరిగిన ధరలతో గత రెండు నెలలుగా సామాన్య, మధ్యతరగతి జీవులు అవస్థలు పడుతున్నారు. ఇదివరకు నెల బడ్జెట్‌లో కూరగాయలకు రూ.450 కేటాయిస్తే సరిపోయేది ఇప్పుడు వెయ్యి రూపాయలు కేటాయించినా సరిపోయే పరిస్థితి లేదు. ధరలు రెట్టింపు కావడంతో కిలో కొనేవారు అరకిలో, అరకిలో కొనేవారు పావు కిలో మేరకు కొనుగోలు చేస్తున్నారు. ఇదివరకు మూడు పూటలు కూరగాయలతో తినేవారు ఇప్పుడు ఒకేపూటతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఏ కూరగాయ కొనుగోలు చేయాలన్నా కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు వెచ్చించాల్సి వస్తుంది. ఆలుగడ్డ, బెండకాయ కిలో ధర రూ.35 చొప్పున, పెద్ద చిక్కుడు, బీర్నిస్, దొండకాయ, మిర్చి రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్క టమాటా ధర మాత్రం కాస్త దిగివచ్చింది. కిలో రూ.20 పలుకుతుంది. పాలకూర కట్ట ఒకటి రూ.5, కోతిమీర, కరివేపాకు ఒక కట్ట రూ.5 చొప్పున అమ్ము తున్నారు. ఆదివారం జోగిపేటలో జరిగిన అంగడిలో ఈ ధరలను చూసి సామాన్యులు బిక్కమోహం వేశారు. కూరగాయల ధరలన్నీ ఒకేసారి పెరిగిపోవడంతో ఏ కూరగాయలు కొనుగోలు చేయాలో అర్థం కాని జనం సతమతమవుతున్నారు.
 
 ధరలు తగ్గలేదు
 టమాటా మినహా ఇతర కూరగాయల ధరలు తగ్గలేదు. ఒక్కో కూరగాయ ధర కిలో రూ.40 వరకు ఉంది. ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గాయి. ధరలు తక్కువగా ఉంటేనే అన్ని వర్గాల వారు కొనుగోలు చేస్తారు.
 - రమేశ్, కూరగాయల వ్యాపారి, జోగిపేట

Advertisement
 
Advertisement
Advertisement