‘చంద్రబాబు హోదా తేలేని అసమర్థుడు’

Vanchana Pai Garjana Ummareddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని అసమర్థుడని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి చంద్రబాబు, మోదీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి, నరేంద్ర మోదీ ప్రధాని అయినా ఏపీకి హోదా రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన అసమర్థతను ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వంచనపై గర్జన దీక్షను టీడీపీ, బీజేపీ వంచనపై గర్జనగా అభివర్ణించారు. ఎంపీలందరూ రాజీనామా చేద్దామంటే టీడీపీ ఒప్పుకోలేదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలందరూ రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేసిన సంగతిని గుర్తుచేశారు. హోదా కోసం ఇప్పుడు చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు యూటర్న్‌పై పీడీ కేసు పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు,విద్యార్థులు, డ్వాక్రామహిళలు సహా అన్ని వర్గాలను చంద్రబాబు వంచించారని మండిపడ్డారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top