జోరుతగ్గని పోరు | united agitation become severe in nellore district | Sakshi
Sakshi News home page

జోరుతగ్గని పోరు

Oct 9 2013 4:29 AM | Updated on Oct 20 2018 6:17 PM

సమైక్యపోరు మొదలై 70 రోజులు దాటుతున్నా నేటికీ సింహపురిలో హోరు తగ్గలేదు. సమైక్యాంధ్రను సాధించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ జిల్లావాసులు నినదిస్తున్నారు.

సాక్షి, నెల్లూరు : సమైక్యపోరు మొదలై 70 రోజులు దాటుతున్నా నేటికీ సింహపురిలో హోరు తగ్గలేదు. సమైక్యాంధ్రను సాధించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ జిల్లావాసులు నినదిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సమైక్య పోరు మంగళవారం ఉధృతంగా సాగింది. విద్యుత్ సిబ్బంది సమ్మెతో మూడో రోజు జిల్లాలో పగటి పూట విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు.
 
 నెల్లూరు నగరంలోని వీఆర్‌సీ సెంటర్‌లో పొట్టి శ్రీరాములు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చాకిరేవు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.  గూడూరులో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, పట్టణ కన్వీనర్ నాసిన నాగులను మంగళవారం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
 
 జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు మద్దతుగా నేదురుమల్లి పద్మనాభరెడ్డి దంపతులు మూడో రోజు మంగళవారం రిలే దీక్షలు కొనసాగించారు. కావలిలో ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలో కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. బోగోలులో జాతీయ రహదారిపై బో గోలు బ్రహ్మాస్త్రం కార్యక్రమాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయగిరిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సీతారాంపురానికి చెందిన పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు.
 
 వింజమూరు, ఉదయగిరి, దుత్తలూరు, కలిగిరి మండలాల్లో జేఏసీ నేతల ఆధ్వర్యంలో బ్యాంకులు, తపాలా, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలు మూయించారు. సూళ్లూరుపేటలో మన్నారుపోలూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు పవర్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్ అయి షార్ కేంద్రానికి, రైల్వే లైనుకు, మాంబట్టు పారిశ్రామికవాడలోని పలు కంపెనీలకు కరెంటు సరఫరా ఆగి పోయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement