ఊరంతా తోడై... అమ్మకు గూడయి... | Villagers built a new house to replace the old house | Sakshi
Sakshi News home page

ఊరంతా తోడై... అమ్మకు గూడయి...

Jun 23 2026 6:34 AM | Updated on Jun 23 2026 6:34 AM

Villagers built a new house to replace the old house

మానవత్వం

మాయమైపోతున్న మనిషి గురించి చెప్పుకోవడానికి ఎన్నో అమానవీయ సంఘటనలు ఉన్నాయి. ‘ఎవరికి ఎవరు ఈ లోకంలో!’ అనే నిరాశ ఆవహించిన ఈరోజుల్లో... చిన్న సహాయమైనా... మానవత్వం గురించి పెద్ద ఆశను రేకెత్తిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటమ్మకు కొడుకే సర్వస్వం. దురదృష్టవశాత్తు అతడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాద పరిస్థితిలో... ‘అమ్మా... నీకు మేమున్నాం’ అంటూ ఊరు ముందుకువచ్చింది. శిథిలావస్థలో ఉన్న ఇంటి స్థానంలో కొత్త ఇల్లు నిర్మించింది...

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని కలవోక గ్రామానికి చెందిన 25 ఏళ్ల పనస సైదులు తండ్రి చిన్నప్పుడే మరణించాడు. తల్లి వెంకటమ్మ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని వెళ్లదీసింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లిని పోషించుకోవడానికి కుమారుడు సైదులు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా మారాడు. 

ఎలాగోలా తన గుడిసె స్థానంలో ఓ పక్కా ఇల్లు కట్టుకోవాలని అనుకునేవాడు. తన ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో రేపో మాపో కుమారుడికి పెళ్లి చేసి, బాధ్యతను తీర్చుకోవాలని ఆ తల్లి అనుకుంటున్న తరుణంలో విధి వక్రించి రోడ్డు ప్రమాదం సైదులును మింగేసింది. సంక్రాంతి పండుగ రోజున ట్రాక్టర్‌పై వెళ్లి వస్తున్న సమయంలో యాక్సిడెంట్‌ జరిగి సైదులు మరణించాడు. తనను ్ర΄ాణంగా చూసుకుంటున్న కొడుకు మరణించడంతో వెంకటమ్మ తల్లడిల్లిపోయింది.

ఊరంత కుటుంబం!
కుమారుడి మరణంతో ఒంటరిగా మారిన వెంకటమ్మకు సహాయం అందించాలని గ్రామంలోని ‘గణేశ్‌ యూత్‌’ భావించింది. రూ. 15 – రూ. 20 వేలు పోగేస్తే ఆమెకు నిత్యావసరాలకు పనికి వస్తాయని స్థానిక వాట్సాప్‌ గ్రూపులో సమాచారాన్ని పెట్టారు. సైదులు మరణించిన ఇరవై రోజుల్లోనే ఊహించని విధంగా రూ. 2.5 లక్షలకు పైగా సమకూరింది. గ్రామస్థులంతా వెళ్లి వెంకటమ్మను కలిశారు. 

ఇప్పుడున్న పూరి గుడిసె కురుస్తోందని, వర్షాకాలంలో గాలి వాన వస్తే గడ్డితో కూడిన ఇంటి పైకప్పు ఎగిరిపోతుందని భయపడాల్సి వస్తోందని చెబుతూ, పక్కా ఇల్లు కట్టుకోవాలనుకున్న తన కొడుకు కోరికను గుర్తు చేసింది వెంకటమ్మ. దీంతో గ్రామస్థులందరూ కలిసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. గ్రామస్థులతో కలిసి వెంకటమ్మ గృహ ప్రవేశం చేసింది. చిన్న కూతురు ఇప్పుడు తల్లికి తోడుగా అదే ఇంట్లో ఉంటోంది.

అనారోగ్యం... అప్పులు
అనారోగ్యం కారణంగా ప్రతి నెల రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు మందులకు ఖర్చు చేయాల్సి వస్తోందని, అప్పుల ΄ాలయ్యానని, తన కూతురు బంగారు నగలు తాకట్టు పెట్టి గతంలో అప్పు తీసుకున్నానని, దాతలు సహాయం చేయాలని కోరుతుంది వెంకటమ్మ                                     

– చింతకింది గణేశ్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement