
సాక్షి, విజయనగరం: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 270వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్త వలస మండలం నుంచి ప్రారంభించారు. అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిమ్మలపాలెం వద్ద గురుదేవ్ చారిటబుల్ ట్రస్టు సభ్యులు రాష్ట్ర ప్రతిపక్ష నేతను కలిశారు. ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలు జననేతకు ట్రస్టు సభ్యులు వివరించి.. ట్రస్టు పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే దివ్యాంగులకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
జిందాల్ కార్మికులు కూడా రాజన్న బిడ్డకు తమ సమస్యలను చెప్పుకున్నారు. కనీస వేతనాలు అమలు చేయడం లేదని చంద్రబాబు ప్రభుత్వంపై కార్మికులు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, జిందాల్ యాజమాన్యం కుమ్మక్కై కార్మికులకు అన్యాయ చేస్తున్నారని పిర్యాదు చేశారు. బాధితులు స్వయంగా ఈ ప్రభుత్వం వల్ల, టీడీపీ నాయకుల కక్షసాధింపుల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తను ముందు వివరించడాన్ని చూసి జననేత చలించి పోయారు. సమస్యలు విన్నవించుకున్న వారికి భరోసా ఇస్తూ రాజన్న తనయుడు ముందుకు కదిలారు.