ఏపీ గవర్నర్‌తో ట్రైనీ ఐఏఎస్‌ల భేటీ

Trainee IAS officers meet AP Governor Biswabhusan Harichandan - Sakshi

అత్యున్నత పౌరసేవకు వారధి ఐఎఎస్ 

సాక్షి, విజయవాడ : సమాజంలోని పేద వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయవలసిన అతి పెద్ద బాధ్యత అఖిల భారత సర్వీసుల అధికారులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఐఎఎస్ అధికారిగా పని చేయటం అంటే అత్యున్నత పౌర సేవకు అవకాశం పొందినట్లు భావించాలన్నారు. ప్రజా సమస్యలను సానుకూల దృక్పధంతో పరిశీలించగలిగినప్పుడే పరిష్కారాలు లభిస్తాయని గవర్నర్‌ పేర్కొన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించబడి, రాష్ట్ర సచివాలయంలో శిక్షణ పొందుతున్న ఐఎఎస్ అధికారులు సోమవారం రాజ్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ముస్సోరీలో వీరు తీసుకోవలసిన రెండవదశ  తప్పనిసరి శిక్షణా కార్యక్రమం వాయిదా పడింది. ఈ క్రమంలో వారిని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోని వివిధ విభాగాలలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (ట్రైనీ ఐఏఎస్‌లతో సీఎం జగన్‌ సమావేశం)

ట్రైనీ ఐఎఎస్ అధికారులతో గవర్నర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు. విధుల నిర్వహణలో మార్గదర్శక శక్తిగా రూపుదిద్దుకోవాలని సూచించారు. ప్రజా పరిపాలనలో పారదర్శకతకు కట్టుబడి ఉండాలని గవర్నర్ అన్నారు. జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి, సాంఘిక సమానత్వం, మత సామరస్యం, ప్రాంతీయ అభివృద్ధి సాధనకు సివిల్ సర్వీస్ అధికారులు బాధ్యత వహించాలని గవర్నర్ అన్నారు.

అనంతరం సీనియర్ ఐఎఎస్ అధికారి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను ప్రత్యేకంగా కలిసి విభిన్న అంశాలపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అనుపమ అంజలి, ప్రతిష్ట మమగైన్, హిమాన్హు కౌశిక్, కల్పనా కుమారి, సూరజ్ డిజి, వైదిఖేర్, నుపర్ ఎకె శివాస్, మౌర్య నారపురెడ్డి, ఇమ్మడి పృధ్వీ తేజ్, ఖేతన్ ఘర్గ్, భార్గవ్ టి అమిలినేని, జాహ్నవి తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top