నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు చెక్‌

Traffic Police Awareness in Visakhapatnam - Sakshi

విశాఖపట్నం  ,అనకాపల్లిటౌన్‌: ట్రాఫిక్‌ నిబంధనలు  పాటిం చడం వల్ల రోడ్డు  ప్రమాదాలు నివారించవచ్చని డీఎస్పీ ఎస్‌.వి.వి. ప్రసాదరావు అన్నారు. స్థానిక నెహ్రూచౌక్‌ వద్ద 30వ జాతీయ రోడ్డు భద్రతావారోత్సవాలను  ఎస్పీ అట్టాడ బాబూజీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నెహ్రూచౌక్‌ నుంచి పెరుగుబజారు మీదుగా  ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్,  కారు డ్రైవర్లు సీటుబెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలన్నారు. డివిజన్‌ పరిధిలో ట్రాఫిక్‌ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అనకాపల్లి పట్టణంలో పార్కింగ్‌ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ వారోత్సవాలు  10వతేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.బుచ్చిరాజు మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే 80 «శాతం రోడ్డు ప్రమాదాలు  జరుగుతున్నాయని  తెలిపారు.  ట్రాఫిక్‌ సీఐ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ   అతివేగం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, సిగ్నల్‌ జంపింగ్, వన్‌వే ప్రయాణం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.   పట్టణ సీఐ ఎస్‌.తాతారావు మాట్లాడుతూ  మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాల బారినపడితే  వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మద్యం సేవించి వాహనాలు నడిపితే అపరాధ రుసుంతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు అప్పన్న, శ్రీనివాసరావు, వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు, ఉషా తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top