
గోదావరీ తీరాన వివేక సూర్యోదయం
భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని దిగంతాలవరకు చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడు.
రాజమండ్రి కల్చరల్, న్యూస్లైన్ : భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని దిగంతాలవరకు చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడు. శ్రీరామకృష్ణ మఠం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు 2011లో ప్రారంభమయ్యాయి. ఆ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు రాజమండ్రి ప్రభుత్వ అటానమస్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. దానికోసం భారీగా ఏర్పాట్లు చే స్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేం దుకు దేశవ్యాప్తంగాగల శ్రీరామకృష్ణ మఠాలకు చెందిన స్వామీజీలు, పీఠాధిపతులు, మేధావులు రానున్నారు. వారందరూ ఆవేదికపై నుంచి ఉత్తేజకరంగా ప్రసంగాలు చేయనున్నారు.
గోదావరితో వివేకానందునికి పరోక్ష అనుబంధం
గోదావరీ తీరంతో స్వామి వివేకానందునికి పరోక్షంగా ప్రగాఢ అనుబంధం ఉంది. రాజమండ్రి వాసి ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావుకు స్వామి వివేకానందునితో ప్రత్యక్షంగా అనుబంధం ఉంది. అమెరికా, యూరోప్ దేశాలలో భారతీయ సనాతన ధర్మవాణిని ఎలుగెత్తి చాటాక 1897 ఫిబ్రవరిలో వివేకానందుడు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయనకు ఘనస్వాగతం చెప్పడానికి మద్రాసుకు చెందిన హేమాహేమీలతో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీకి అధ్యక్షుడు న్యాపతి సుబ్బారావే. అంతేకాదు 1897 ఫిబ్రవరి 11, 14 తేదీల్లో మద్రాసు నగరంలోని విక్టోరియా హాల్లో స్వామి వివేకానందుడు ‘భారతదేశంలో సాధుపురుషులు’ , ‘భారతదేశం భవిత’ అనే అంశాలపై ప్రసంగించారు. ఆ రెండు సభలకు న్యాపతి సుబ్బారావే అధ్యక్షత వహించారు. తనకో జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని అనుగ్రహించాల్సిందిగా న్యాపతి వివేకానందుని కోరారు. భగవద్గీతను ప్రచారం చేయాల్సిందిగా స్వామి ఆయనకు సూచించారు. ఆ క్రమంలో రాజమండ్రి టి.నగరులో హిందూ సమాజాన్ని న్యాపతి సుబ్బారావు స్థాపించడం వెనుక వివేకానందుని ప్రేరణ ఉంది.
రామకృష్ణ మఠం సేవలు
రాజమండ్రిలో రామకృష్ణ మఠం 1951లో ప్రారంభమైంది. మఠం ఆధ్వర్యంలో నగరంలో నిర్వహిస్తున్న ధర్మాసుపత్రి నామమాత్రపు రుసుముతో అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద వైద్యసేవలను చిరకాలంగా అందిస్తోంది. 30 ఏళ్లుగా రంపచోడవరం, చుట్టుపక్కల గ్రామాలలో రామకృష్ణమఠం వైద్యసేవలు అందిస్తోంది. సంచార వైద్యవాహనాల్లో రంపచోడవరం చుట్టుపక్కల నాలుగు మండలాల్లో గిరిజనులకు ఉచితంగా వైద్యసేవలు, మందులు అందజేస్తున్నారు.