అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాల్సిందే | To be united in the resolution of the Assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాల్సిందే

Jan 9 2014 5:17 AM | Updated on May 29 2018 4:09 PM

‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇప్పుడు అసెంబ్లీ ముందు ఉన్న ఒకేఒక ఆయుధం సమైక్యాంధ్ర తీర్మానం చేయడమే.

ఒంగోలు, న్యూస్‌లైన్: ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇప్పుడు అసెంబ్లీ ముందు ఉన్న ఒకేఒక ఆయుధం సమైక్యాంధ్ర తీర్మానం చేయడమే. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఆ దిశగా కృషి చేయాలి’ అని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు జరిగిన రిలే దీక్షల్లో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రంలో జరిగిన దీక్షలో పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఒక్కటే మార్గమన్నారు.
 
కాంగ్రెస్ ఒక వైపు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తూ, మరోవైపు తమ పార్టీని టార్గెట్ చేయాలని చూడడం దారుణమన్నారు. ఇప్పటికైనా సీఎం కిరణ్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం 15 మంది నిరాహార దీక్షకు పూనుకున్నారు. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మలు రిలే దీక్షలను ప్రారంభించారు. ఇక్కడ 10 మంది, పామూరులో 8 మంది, వెలిగండ్లలో 17మంది దీక్షల్లో కూర్చున్నారు. దర్శిలోని రెవెన్యూ కార్యాలయ సమీపంలో చేపట్టిన దీక్షలను నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర తీర్మానం చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీలో చర్చ కోసం పట్టుబట్టి ఏదో ఒక విధంగా సోనియా గాంధీ నిర్ణయానికి మద్దతు పలకాలన్న కుట్రలను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. టీడీపీ అధినేత ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతం పాటిస్తూ ప్రజలను వంచన చేస్తున్నారని మండిపడ్డారు. 33 మంది దీక్ష చేపట్టారు. గిద్దలూరులో 12 మంది దీక్ష వహించగా.. నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుమల అశోక్‌రెడ్డి ప్రారంభోపాన్యాసం చేశారు.
 
మద్దిపాడులో జరిగిన దీక్షలను సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, వరికూటి అమృతపాణిలు ప్రారంభించారు. పెద్దారవీడులో సమన్వయకర్త పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో 15 మంది దీక్ష చేపట్టారు. చీరాలలో 9మంది దీక్షలో కూర్చోగా.. సమన్వయకర్తలు పాలేటి రామారావు, సజ్జాహేమలతలు ప్రారంభించారు. ఒంగోలులో వివిధ అనుబంధ సంఘాల నగర కన్వీనర్లు చేపట్టిన శిబిరాన్ని ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్ ప్రారంభించారు. యూత్ నగర కన్వీనర్ నెరుసుల రాము, సేవాదళ్ నగర కన్వీనర్ కంకణాల వెంకట్రావు, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ ముదివర్తి బాబూరావు, ఎస్సీసెల్ నగర కన్వీనర్ వై.రమేష్, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, బీసీ విభాగం నగర కన్వీనర్ బొప్పరాజు కొండలరావు, విద్యార్థి విభాగం నగర కన్వీనర్ రేలా అమర్‌నాథ్‌రెడ్డి, ప్రచార కమిటీ నగర కన్వీనర్ దూళిపూడి ప్రసాద్‌నాయుడు, నగర అధికారప్రతినిధి రొండా అంజిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు రాయని వెంకట్రావు, గాలేటి వెంకటేశ్వర్లు, మారెడ్డి రామకృష్ణారెడ్డి, మహిళా నాయకులు పాలేటి లక్ష్మి, బత్తుల ప్రమీల, ఎస్.మహాలక్ష్మి, షేక్ రసూల్, గంధం సామేలు, వర్థుశేషయ్య తదితరులు దీక్ష చేపట్టారు. సాయంత్రం దీక్షకు హాజరైన జిల్లా అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ డీఎస్ క్రాంతికుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తోటపల్లి సోమశేఖర్ సంఘీభావం ప్రకటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement