భద్రాద్రిని విడదీయొద్దని.. రిలే దీక్షలు ప్రారంభం | TJAC demands to keep badrachalam in telangana | Sakshi
Sakshi News home page

భద్రాద్రిని విడదీయొద్దని.. రిలే దీక్షలు ప్రారంభం

Nov 11 2013 5:20 AM | Updated on Jun 4 2019 6:28 PM

భద్రాచలం ప్రాంతాన్ని తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం ప్రాంతాన్ని తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ  ఏర్పాటు సమయంలో భద్రాచలంపై కిరికిరి పెట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణవాదుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు వెలువడినా అంగీకరించబోమని చెప్పారు. జైరామ్మ్రేష్, ఆంటోనీ కమిటీల నివేదికలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఏసీ గదుల్లో కూర్చొని నివేదికలు పొందుపరిస్తే ఇక్కడి సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే ఉంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్న సహించేది లేదని హెచ్చరించారు.

భద్రాచలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని, అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. దీక్షలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కుంజా సత్యవతి మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రుల అడగటం అవివేకమన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసమే భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రలో విలీనం చేయాలని చూస్తున్నార ని, ఇదే జరిగితే ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీజేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య దీక్షలను సందర్శించి మద్దతు తెలిపారు. తొలిరోజు దీక్షలో టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి ఎస్‌కే గౌసుద్ధీన్, రేగలగడ్డ ముత్తయ్య, వెక్కిరాల శ్రీనివాస్, కిశోర్, సోమశేఖర్, హనుమాన్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు కుంజా సీతారాములు తదితరులు కూర్చొన్నారు.
 ఆదివారం నాటి దీక్షలను భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. దీక్ష శిబిరాన్ని వివిధ పార్టీల నాయకులు బొలిశెట్టి రంగారావు, రమేష్‌గౌడ్, తాండ్ర నర్సింహారావు, రాజేష్, నక్కా ప్రసాద్, కుంచాల రాజారామ్, టీవీ, కల్లూరి వెంకటేశ్వరరావు,  ఆవుల సుబ్బారావు, కెచ్చెల కల్పన, సోందె వీరయ్య, మడివి నె హ్రూ, పడిసిరి శ్రీనివాస్, వర్తక సంఘం నాయకులు వాసిరెడ్డి అజేయ్‌కుమార్ సందర్శించి మద్దతు పలికారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement