పరిశ్రమలపై చార్జీల పిడుగు | Thunderbolt industries charges | Sakshi
Sakshi News home page

పరిశ్రమలపై చార్జీల పిడుగు

Feb 7 2015 2:56 AM | Updated on Sep 5 2018 3:44 PM

కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వాల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు రాకపోగా విద్యుత్ చార్జీల భారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన్ని కుదిపేస్తోంది.

సాక్షి, హైదరాబాద్: కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వాల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు రాకపోగా విద్యుత్ చార్జీల భారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన్ని కుదిపేస్తోంది. తాజాగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఆ రంగం జీర్ణించుకోలేకపోతోంది. భారీ పరిశ్రమలకు ఇది మరింత పెనుభారంగా మారుతోందని అంటున్నారు. దీనివల్ల కొత్త పరిశ్రమలు వచ్చేదెలాగని ప్రశ్నిస్తున్నారు.
 
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమలకు పెద్దఎత్తున విద్యుత్ రాయితీలిచ్చారు. ఆ తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు మాత్రం ఏకంగా 10 శాతం విద్యుత్ భారాన్ని మోపింది. ప్రస్తుతం కొత్త రాష్ట్రం కావడం, పారిశ్రామిక పెట్టుబడులకోసం ప్రయత్నిస్తున్న కారణంగా విద్యుత్ చార్జీల మోత ఉండదని భావించారు. డిస్కంలు మాత్రం ఇందుకు భిన్నంగా ఏఆర్‌ఆర్‌లు సమర్పించాయి.

పరిశ్రమలకు దాదాపు 6 శాతం పెంపును ప్రతిపాదించాయి. దీనివల్ల ప్రత్యక్షంగా రూ.450 కోట్ల భారం పడుతుందని వారంటున్నారు.పీక్ అవర్స్‌లో వాడుకునే విద్యుత్ చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచాలని నిర్ణయించింది. అంటే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య అదనపు చార్జీ చెల్లించాలనేది ప్రభుత్వ వాదన. దీన్ని కె.వి.ల వారీగా విధించారు. టైమ్ ఆఫ్ డే(టీవోడీ) చార్జీలు గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి పెంచిన దానికన్నా, అదనంగా 6 శాతం పెంచారు. మొత్తం యూనిట్లకు ఇది పూర్తిగా అదనమే.

ఈ సమయంలో గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తాయని, కొత్త రాష్ట్రం కావడం వల్ల ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయని, అనుమతులు కూడా తేలికగా లభిస్తాయని పారిశ్రామిక వేత్తలు అంచనా వేశారు. సింగపూర్, జపాన్ కంపెనీలు పెద్ద ఎత్తున భారీ పరిశ్రమలకు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. దీనికితోడు హెచ్‌టీ నష్టాలు బాగా తగ్గుతాయనీ స్పష్టం చేశారు. దీన్నిబట్టి విద్యుత్ వినియోగం పరిశ్రమలకు కనీసం 20 నుంచి 30 శాతం పెరుగుతుందనేది ఓ అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement