చండ్రుగొండలో అదృశ్యం... తిరుపతిలో ప్రత్యక్షం.. | Three students missed, apper at tirupati | Sakshi
Sakshi News home page

చండ్రుగొండలో అదృశ్యం... తిరుపతిలో ప్రత్యక్షం..

Nov 6 2013 5:59 AM | Updated on Sep 2 2017 12:20 AM

స్థానిక బీసీ సంక్షేమ హాస్టల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు రెండు రోజుల క్రితం అదృశ్యమై తిరుపతికి వెళ్లినట్లు తెలిసింది.

చండ్రుగొండ, న్యూస్‌లైన్: స్థానిక బీసీ సంక్షేమ హాస్టల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు రెండు రోజుల క్రితం అదృశ్యమై తిరుపతికి వెళ్లినట్లు తెలిసింది. సోమవారం పాఠశాలకు వచ్చిన వీరు మధ్యాహ్న  భోజన సమయం నుంచి కన్పించకుండా పోయారు. ఈ విషయంపై వారి తల్లిదండ్రులు మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చండ్రుగొండ గ్రామానికి చెందిన పల్లోజి వంశీకృష్ణ, దోరేపల్లి నాగేంద్రబాబు, లక్ష్మీశెట్టి సాయిఫణికుమార్‌లు స్థానిక బీసీ సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేసి పాఠశాలకని చెప్పి వెళ్లారు.  కానీ మధ్యాహ్నం నుంచి పాఠశాలకు మాత్రం రాలేదని ప్రధానోపాధ్యాయుడు తెలిపాడు. అసలు దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి వసతి గృహానికే రాలేదని వార్డెన్ శ్రీధర్ తెలిపారు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు దర్యాప్తు చేపట్టారు.   
 
 లభించిన ఆచూకీ...
 రెండు రోజుల క్రితం అదృశ్యమైన వీరు తిరుపతిలో ఉన్నట్లు తెలిసింది. వీరు ముగ్గురు తిరుపతి రైల్వే పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. దీంతో అక్కడి పోలీసులు వీరిని విచారించగా పేర్లతో సహా చిరునామాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో రైల్యే పోలీసులు వారిని తిరుపతి - మచిలీపట్నం రైలులో ఎక్కించి విజయవాడలో పోలీసులకు అప్పగించాలని కోరినట్లు ట్రైన్ టీసీ శివారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటీన విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement