తండ్రి ఎదుటే.. ప్రాణాలు విడిచిన కొడుకు | The son of survivors left before the Father | Sakshi
Sakshi News home page

తండ్రి ఎదుటే.. ప్రాణాలు విడిచిన కొడుకు

Feb 15 2015 2:51 AM | Updated on Sep 27 2018 5:46 PM

ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పొక్లెయిన్ ఢీకొనడంతో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆటోను ఢీకొన్న పొక్లెయిన్
బాలుని మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

 
దర్శి : ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పొక్లెయిన్ ఢీకొనడంతో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వెంకటాచలం పల్లె సమీపంలోని నడింపల్లి అడ్డ రోడ్డు వద్ద శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని తుమ్మెదలపాడు గ్రామానికి చెందిన నలదిమ్ము రమణారెడ్డి(12) శివదీక్ష తీసుకున్నాడు. ఇరుముడి కట్టుకుని సోమవారం శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. బంధువులను ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టి శ్రీశైలం వెళ్లాలనుకున్నాడు. తండ్రి వెంకటేశ్వర్లుతో కలిసి సరుకుల కోసం దర్శి వెళ్లాడు. సరుకులు తీసుకుని ఆటోలో తండ్రీకొడుకులు స్వగ్రామం బయల్దేరారు. నడింపల్లి అడ్డరోడ్డు వద్దకు రాగానే ఓ పొక్లెయిన్ వచ్చి ఆటోను బలంగా ఢీకొని బోల్తా కొట్టింది. పొక్లెయిన్ డ్రైవర్ అక్కడి నుంచి దూకి పరారయ్యాడు. ఆటోలో డ్రైవర్ పక్కన కుడివైపు రమణారెడ్డి, ఎడమ వైపు తండ్రి వెంకటేశ్వరరెడ్డి కుర్చొన్నారు.    

పొక్లెయిన్ కుడి వైపున బలంగా ఢీకొనడంతో రమణారెడ్డి అక్కడికక్కడే తండ్రి కళ్ల ముందే కన్నుమూశాడు. ఆటోలో ఉన్న మరో ఇద్దరు ఆవుల వెంకటనారాయణరెడ్డి, బూసిరెడ్డి సత్యనారాయణరెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసిన తల్లి రమణమ్మ, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. మృతుని సోదరుడు వెంకట కృష్ణారెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. భగవంతుడా ఎందుకు అన్యాయం చేశావన్నారు. పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement