
జనం రుణం తీర్చుకుంటా
పట్టణంలోని 31వ వార్డు ప్రజల రుణం తీర్చుకునే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని మున్సిపల్ చైర్మన్ కొడవలి
మదనపల్లె: పట్టణంలోని 31వ వార్డు ప్రజల రుణం తీర్చుకునే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్ అన్నారు. స్థానిక 31వ వార్డులో శుక్రవారం జరిగిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. తాను ఈ వార్డు నుంచే కౌన్సిలర్ గా పోటీ చేసి గెలిచానన్నారు. అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెడతానన్నారు. పట్టణాభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్, కమిషనర్ దేవ్సింగ్, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, నాయకులు పులిమోహన్, పసుపుపొడి రవి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
చైర్మన్ గీ కౌన్సిలర్
స్థానిక మున్సిపాలిటీలోని 30వ వార్డులో జరిగిన జన్మభూమి సభలో చైర్మన్, కౌన్సిలర్ మధ్య తీవ్ర వాదోపవాదాలు సాగాయి. సభకు వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్ మహమ్మద్ రఫి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ జన్మభూమి నిర్వహించే ప్రాంగణంలో ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంతో జనం ఎండలో నిలబడాల్సి వచ్చిందన్నారు. తమ వార్డులో పింఛన్లు, నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో పేదలందరికీ సముచితన్యాయం జరిగిందని పేర్కొంటుండగా చైర్మన్ కొడవలి శివప్రసాద్ జోక్యం చేసుకున్నారు. సభలో సమస్యల మీద మాత్రమే మాట్లాడాలని, రాజకీయ నాయకుల గురించి ప్రసంగించొద్దని హుకుం జారీ చేశారు. దీంతో ఇద్దరి మధ్య కొంత సేపు తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. మున్సిపల్ కమిషనర్ ఇద్దరికీ సర్ధి చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.