టీఆర్‌ఎస్‌ను వీడటం వారి పొరపాటు | Telangana means leaving to their mistake | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను వీడటం వారి పొరపాటు

Aug 24 2013 2:14 AM | Updated on Apr 7 2019 4:30 PM

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల ప్రకటన చేసినందున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనుకోవటం పొరపాటని టీఆర్‌ఎస్ పార్లమెంట్ ఇన్‌చార్జి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

ఆలంపల్లి, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల ప్రకటన చేసినందున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనుకోవటం పొరపాటని టీఆర్‌ఎస్ పార్లమెంట్ ఇన్‌చార్జి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడంతో టీఆర్‌ఎస్ బలహీనపడుతుందన్న అభిప్రాయంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ను వీడిన కొందరు నాయకులు కాంగ్రెస్‌లో చేరడం పొరపాటన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్దానికి పైబడి టీఆర్‌ఎస్ సాగించిన ఉద్యమ ఫలితంగానే కాంగ్రెస్ దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేసిందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.
 
 సాధారణ ఎన్నికల్లో 12 పార్లమెంటు సీట్లు టీఆర్‌ఎస్ గెల్చుకోవడం ఖాయమని అన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసి  రెవెన్యూ, పోలీసు తదితర కీలక శాఖలను తమ ఆధీనంలో ఉంచుకోవాలని సీమాంధ్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ సహా ఉద్యోగాలు, నీళ్లు, విద్యుత్ తదితర అన్ని వనరులు ఉన్న తెలంగాణ సాధన ధ్యేయంగా టీఆర్‌ఎస్ పోరాడుతుందన్నారు. ఈ సందర్భంగా నవాబుపేట్ మాజీ సర్పంచ్ కల్యాణ్‌రావు తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, కార్మిక విభాగం అధ్యక్షుడు కృష్ణయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, పార్టీ చేవెళ్ల ఇన్‌చార్జి దేశమోళ్ల ఆంజనేయులు, టీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎస్సీ సెల్ కార్యదర్శి రామస్వామి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement