ఇద్దరు విద్యార్థులు గొడవపడగా, ఓ విద్యార్థిని గదిలో వేసి ఇద్దరు ఉపాధ్యాయులు కర్రలతో దారుణంగా చితక బాదిన సంఘటన సోమవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మెదక్ టౌన్, న్యూస్లైన్: ఇద్దరు విద్యార్థులు గొడవపడగా, ఓ విద్యార్థిని గదిలో వేసి ఇద్దరు ఉపాధ్యాయులు కర్రలతో దారుణంగా చితక బాదిన సంఘటన సోమవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తండ్రి షాహెద్ అలీబేగ్ తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని కువాత్ ఇస్లాంలో నివాసం ఉండే సోయబ్ అలీ స్థానిక ప్రైవేటు స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. కాగా సోమవారం పాఠశాలలో తోటి విద్యార్థితో సరదాగా గొడవపడ్డాడు.
దీనిని గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మణ్, నందీప్లు విద్యార్థి సోయెబ్ అలీని గదిలోవేసి కర్రలతో చితక బాదారు. దీంతో అతని వీపంతా పూర్తిగా కమిలిపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి షాహెద్అలీబేగ్ పాఠశాల ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విద్యార్థి సోయెబ్ అలీని చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.