విమానం ఎగరావచ్చు..!

Surveys On The Feasibility Of Developing The Airport As A Hub  Center Of Donaconda  - Sakshi

ఆకాశయానం.. అందేనా?

ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా పరిశీలనలో విమానాశ్రయం

తాజాగా అధికారుల బృందం పరిశీలన, కేంద్రానికి నివేదిక

అనువైన జిల్లాలకు విమానాశ్రయాల ఏర్పాటు వైఎస్సార్‌ స్వప్నం

సాక్షి, ఒంగోలు సిటీ: జిల్లాలో మళ్లీ విమానం ఎగరనుందా..? దొనకొండలో ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అడుగులు పడుతున్నాయా..? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆకాశయాన స్వప్నం సాకారం కాబోతోందన్న భావన వ్యక్తమవుతోంది. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జిల్లాలో విమానం రాకపోకలు సాగించిన ఆనవాళ్లున్నాయి. ఆ తర్వాత పాలకులు విమానాశ్రయం అభివృద్ధికి చర్యలు తీసుకోలేకపోయారు. దొనకొండ కేంద్రంగా విమానాలు ఎగిరిన చరిత్రకు ఆనవాలుగానే మిగిలింది. ఇప్పుడు రవాణా వ్యవస్ధ మరింత అభివృద్ధి చెందింది. సుదూర ప్రాంతాలకు నిముషాలు, గంటల వ్యవధిలోనే చేరుకుంటున్నారు. ఆకాశయానం సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేస్తోంది. టికెట్‌ ధరలు అంత బరువనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. విమానాలు దిగేందుకు అనువైన నెలవులు ఏర్పడుతున్నాయి.

ఒకప్పుడు షిరిడీ వెళ్లాలంటే రెండున్నర రోజులు ప్రయాణం చేసే వారు. రెండు మూడు రైళ్లు, బస్సులు ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు దగ్గరలోని విమానాశ్రయాల నుంచి షిరిడీ, కాశీ వంటి ప్రదేశాలకు గంట వ్యవధిలోనే ప్రయాణించే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. జిల్లాకు దగ్గరలోని గన్నవరం విమానాశ్రయం నుంచి మహా నగరాలకు, యాత్రా ప్రదేశాలకు విమానయానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక జిల్లాలో విమానం ఎగిరే రోజులు దగ్గర పడ్డాయన్న సంకేతాలు వస్తున్నాయి. త్వరలోనే జిల్లా ప్రజలకు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని అధికారుల సర్వేలే విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి.

జిల్లాలో దొనకొండ కేంద్రంగా విమానాశ్రయం 1934లో నిర్మించారు. అప్పట్లో బ్రిటిష్‌ పాలకులు తమ రాకపోకలను వేగంగా నిర్వహించుకొనేందుకు దొనకొండ అనుకూలమని భావించి విమానాశ్రయాన్ని నిర్మించారు. రైల్వే లైన్లను వారి హయాంలోనే అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడక ముందు నెల్లూరు పరగణాలో దొనకొండ ఉండేది. నెల్లూరు కేంద్రంగా పరిపాలన సాగేది. 1934లో 136.52 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించారు. చిన్న విమానాలు ఇక్కడికి రాకపోకలు సాగించేవి. మహారాష్ట్రలోని మిలటరీ రెజిమెంట్‌ కొద్ది కాలం ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో విమనాలు అధికంగా దొనకొండకు వచ్చాయి. ఇక్కడ విమానాలకు అవసరమైన ఇంధనం నింపుకొనే వారు. బ్రిటీష్‌ ఉన్నతాధికారులు ఇక్కడే సమావేశాలను నిర్వహించుకొనే వారు. విందులు, వినోదాలు, విహారాలకు దొనకొండకు వచ్చే వారు.

1965–70 ప్రాంతంలో చిన్న విమానాలు రాకపోకలు జరిగాయి. ఆ తర్వాత పాలకులు విమానాశ్రయాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా దొనకొండ విమానాశ్రయం నిర్లక్ష్యానికి గురయింది. 1971 తర్వాత విమానాశ్రయం స్ధలం అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఎయిర్‌పోర్టు అధారిటి ఆఫ్‌ ఇండియా పరిధిలోకి విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. అయితే అభివృద్ధి విషయంలో పలు మార్లు ప్రభుత్వానికి విన్నవించిన అప్పటి పాలకులు విమనాశ్రయానికి నిధులు ఇవ్వలేదు. స్థలం అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి అధారిటి అధికారులు పంపిన ప్రతిపాదనలపై కేవలం రూ.43 లక్షల నిధులను విడుదల చేసింది. వీటితో విమానాశ్రయం స్థలం అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఇనుప తీగలతో కంచె ఏర్పాటు చేశారు. ఇంతకు మించి అభివృద్ధిలో అడుగు ముందుకు వేయలేదు.

దివంగత నేత వైఎస్సార్‌ కల..
దివంగత నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారు. అప్పట్లో జిల్లా కేంద్రం వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విమానాశ్రయం నిర్మించాలని తలచారు. ఆయన పాలనలోనే భూసేకరణకు చర్యలు తీసుకున్నారు. జిల్లాకు పలు సందర్భాల్లో పర్యటనకు వచ్చిన వైఎస్సార్‌ ఒంగోలు కేంద్రంగా విమానాశ్రయం నిర్మించే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జిల్లా నుంచి పారిశ్రామిక రాబడి అధికంగా ఉంది. గ్రానైట్‌ ఇతర దేశాలకు ఎగుమతి జరుగుతున్నందున విదేశీ మారకద్రవ్యమే అప్పట్లోనే రూ.2 వేల కోట్ల వరకు ఏటా వచ్చేది. మత్స్య సంపద లావాదేవీలతో ఏటా రూ.1500 కోట్లకుపైగా లాభం వచ్చేది.

ఇక వాణిజ్య పంటల ద్వారా రూ.వందల కోట్లలోనే లావాదేవీలు, రాబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా నుంచి ప్రవాసాంధ్రులు పెరుగుతున్నారు. విదేశాలకు వెళ్లే వారు, అక్కడ వ్యాపారాలు చేసేవారు అధికమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంగా ఇక్కడ ప్రజలకు అవసరాన్ని తీర్చే విధంగా విమానాశ్రయం నిర్మించాలని వైఎస్సార్‌ బలంగా ప్రయత్నం చేశారు. పలు జిల్లాల్లోనూ ఆయన పర్యటన సందర్భంగా ప్రకాశంలో విమానాశ్రయంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ఎయిర్‌ క్రాఫ్ట్‌ నిలిచే విధంగా శాశ్వత ప్రాతిపదికన హెలీప్యాడ్‌లను నిర్మించాలని ప్రతిపాదించారు. అప్పట్లో ప్రభుత్వ కోటరిలోని ముఖ్యులతో ఈ విషయాలపై చర్చించారు. ఆ తర్వాత దివంగత నేత ప్రతిపాదనలను పాలకులు పక్కన పెట్టేశారు. అయినా పలు దఫాలుగా ఈ అంశం చర్చకు వస్తూనే ఉంది.

దఫ దఫాలుగా సర్వేలు..
జిల్లాలో విమానాశ్రయం అంశంపై దఫా దఫాలుగా సర్వే జరిగింది. రెండేళ్ల నుంచి సర్వేలు విపరీతంగా జరిగాయి. దొనకొండ కేంద్రంగా పారిశ్రామికవాడ అభివృద్ధికి ప్రతిపాదనలు ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పటికే ఉన్న విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి సాధ్యాసాధ్యాలపై సర్వేలు చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా జాయింట్‌ డైరెక్టర్‌ రాజ్‌కిషోర్‌ నేతృత్వంలో అధికారుల బృందం ఎస్‌.మకేజా, ఎంజీఎం గుప్తా, ఎంజీఎం సుధీప్‌వర్మ తదితరుల బృందం పర్యటించింది. ఆదివారం దొనకొండలో తాజాగా ధిల్లిలోని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టరేట్‌లోని అధికారులు, ఎం పవర్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు చెందిన ప్రతినిధులు బుల్, పవన్‌ తదితరులు పర్యటించారు. పూర్వం ఇక్కడ నుంచి తయారు చేసిన నివేదికలను స్వయంగా పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి దొనకొండ 103.6 కిమీ దూరంలో ఉంది. కర్నూలు జిల్లాకు 103.8 కిమీ, కడప జిల్లా 133.6 కిమీ, మహబూబ్‌నగర్‌ జిల్లా 160.9 కిమీ దూరంలో ఉంది. జిల్లాలో బేస్తవారపేటకు 17.1 కిమీ, మార్కాపురం 31.51 కిమీ, నంధ్యాల 59.8 కిమీ, వివిధ తీర ప్రాంతాలు 300 కిమీలోపు ఉన్నాయి. ఒక వేళ దొనకొండ అభివృద్ధికి చర్యలు తీసుకుంటే ప్రయోజనాలు, ఇతర అంశాలపై దృష్టి పెట్టారు.

వాన్‌పిక్‌ పరిధిలో బీరంగుంట స్ధలం..
ఒంగోలుకు దగ్గరంలో విమానాశ్రయం నిర్మాణానికి బీరంగుంటలో భూసేకరణ జరిపారు. అయితే 2009లో వాన్‌పిక్‌ కోసం సేకరించిన భూమి విస్తీర్ణంలోనే విమానాశ్రయానికి కేటాయించారు. ప్రతిపాదిత స్ధలం చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. ఆ తర్వాత వెంటనే విమానాశ్రయం  ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాల ఎంపికక చర్యలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద రుద్రకోట ప్రాంతంలో విమానాశ్రయం వల్ల జిల్లా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందా అని పరిశీలించారు. ఆ తర్వాత సర్వే చేసి విరమించుకున్నారు. ఒంగోలు మండంలోని చెరువుకొమ్ముపాలెం, వల్లూరు ప్రాంతంలో ప్రతిపాదించారు. 132 కేవీ విద్యుత్తు లైన్లు పెద్ద పెద్ద టవర్లు ఉన్నందున విమానాలు దిగేందుకు ఇబ్బంది ఉందని ఏవియేషన్‌ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇక్కడ ప్రతిపాదన విరమించుకున్నారు. ఇప్పుడు తిరిగా తాజాగా దొనకొండ విమానాశ్రయం అభివృద్ధి ముందుకు వచ్చింది. కేంద్రం ఇప్పటికే నివేదిక ఇచ్చింది. విమానాశ్రయం నిర్మాణం వల్ల ప్రకాశానికి ప్రయోజనంగా భావిస్తున్నారు. దీంతో కేంద్రం వద్ద విమానాశ్రయ దస్త్రం కదిలింది. త్వరలోనే జిల్లాలో ఎగిరేందుకు రూట్‌ క్లియర్‌ కానుందన్న అంచనాలు నెలకున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top