సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనకు సంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు బస్సు నుంచి పొగలు వచ్చాయి. బస్సు ఇంజిన్ నుంచి వస్తున్న పొగలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కనే బస్సును నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దింపేశాడు. దీంతో, ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.


