దేశానికి రైతు వెన్నెముక అంటారు. రెక్కలు ముక్కలు చేసుకుని లోకమంతటికీ అన్నం పెడుతున్న రైతన్న మాత్రం పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో కుదేలవున్నాడు.
దేశానికి రైతు వెన్నెముక అంటారు. రెక్కలు ముక్కలు చేసుకుని లోకమంతటికీ అన్నం పెడుతున్న రైతన్న మాత్రం పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో కుదేలవున్నాడు. ఆరుగాలం కష్టించి పండించిన చెరకును జిల్లాలోని రెండు షుగర్ ఫ్యాక్టరీలకు తరలించిన రైతులకు బకాయిలు చెల్లించకపోవడంతో వారు మరింత కుంగిపోతున్నారు. ఈ బకాయిల చెల్లింపు గురించి పట్టించుకోని పాలకులు, అధికారుల అలసత్వం ఎలాంటిదో రైతుల బాధలు చూస్తే అర్థమవుతుంది.
సాక్షి, నెల్లూరు : చక్కెర కర్మాగారాలు సకాలంలో రైతులకు బకాయిలు చెల్లించక పోవడంతో జిల్లాలో ఏడాదికేడాదికి చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతోంది. లక్షలు అప్పుచేసి చెరకు సాగు చేసిన రైతులకు సకాలంలో ఫ్యాక్టరీలు బకాయిలు చెల్లించలేదు. దీంతో చెరకు సాగు రైతులకు భారంగా మారింది. వ్యవసాయరంగానికి జిల్లా ప్రసిద్ధిగాంచింది. వరి తర్వాత చెరకు పంటను రైతులు అత్యధికంగా సాగుచేస్తారు.
రైతులకు బాసటగా 1973లో కోవూరు చక్కెర కర్మాగారం ఏర్పాటైంది. 4.5 లక్షల టన్నుల కెపాసిటితో దీనిని నిర్మించారు. ఇదికాక పొదలకూరు,నాయుడుపేటలలో రెండు ప్రైవేటు చక్కెర కర్మాగారాలు వెలిశాయి. నాయుడుపేట ఎంపీ షుగర్స్ 1989-90లో ఏర్పాటైంది. దీంతో పాటు పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం వద్ద 5 లక్షల టన్నుల కెపాసిటీతో వీడీబీ షుగర్ ఫ్యాక్టరీ నిర్మితమైంది. జిల్లాలో మూడు చక్కెర కర్మాగారాలు నెలకొనడంతో రైతులు చెరకు సాగుపై మొగ్గు చూ పారు.
బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, సంగం, పొదలకూరు, కలువాయి, అనంతసాగరం, ఉదయగిరి, వింజ మూరు, ఏఎస్పేట, కలికిరి, మర్రిపాడుతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల పరిధిలో 1400 మందికి పైగా రైతులు 50 వేలకు పైగా ఎకరాల్లో చెరకు సాగుచేసేవారు. ఇక నాన్జోన్గా ఉన్న జిల్లాలోని మిగిలిన ప్రాంతాలతో పాటు వైఎస్సార్ జిల్లాలోని బద్వేలు, పోరుమామిళ్ల, కాశినాయన, బి.కోడూరు, మైదుకూరు, చెన్నూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో 15 వేల ఎకరాలు, కర్నూలు జిల్లా నంద్యాల, చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో 10 వేల ఎకరాల్లో సాగు చేసిన చెరకు పంటను జిల్లాలోని మూడు ఫ్యాక్టరీలకు తరలించేవారు.
బకాయిలు చెల్లించని ఫ్యాక్టరీలు
కొంతకాలం పాటు బాగానే నడిచిన ఫ్యాక్టరీలు రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించక మొండికేశాయి. సాధారణంగా ఫిబ్రవరి,మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతులు చెరకును ఫ్యాక్టరీలకు తరలిస్తారు. నిబంధనల మేరకు పం టను తోలిన నెలలోపే యాజమాన్యం రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. కాని ఫ్యాక్టరీలు రైతులకు నెలలు,ఏళ్ల తరబడి డబ్బు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. బకాయిల కోసం రైతులు కాళ్లరిగేలా తిరిగి పడిగాపులు కాయాల్సి వస్తోంది. గత ఐదారేళ్లుగా ఇదే జరుగుతోంది. ప్రస్తుతం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు కలిపి రూ.12 కోట్లు, ప్రభగిరిపట్నం ఫ్యాక్టరీ రూ.14 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రెండు ఫ్యాక్టరీలు కలిసి రూ.26 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
పట్టించుకోని అధికారులు
బకాయిలు చెల్లించకుండా రైతుల పండించిన చెరకుతో తయారు చేసిన చక్కెరను మాత్రం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే యాజమాన్యాలు అమ్ముకున్నట్టు సమాచారం. షుగర్ కేన్ కమిషనర్, నెల్లూరు,ప్రకాశం,గుంటూరు పరిధిలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్తో పాటు వ్యవసాయ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
తగ్గుతున్న సాగు విస్తీర్ణం
2000వ సంవత్సరానికి ముందు జిల్లా పరిధిలోనే 50 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగైన చెరకు 2011-12 లో కేవలం 25 వేల ఎకరాలకు పడిపోయింది. ఇది మరింత దిగజారి ఈ ఏడాది 15 వేల ఎకరాల్లో కూడా చెరకుపంట సాగుకాలేదు. దీన్ని బట్టి చూస్తే ఏడాదికేడాదికి చెరకు సాగు అనూహ్యంగా పడిపోతున్నట్టు స్పష్టమౌతోంది. దీంతో చెరకు సాగు అంటే భయపడే పరిస్థితి నెలకొందని రైతుసంఘాల సమాఖ్య నాయకుడు కోటిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం, మంత్రి, కలెక్టర్ కూడా రైతుబకాయిల విషయంలో సరిగ్గా స్పందించడం లేదని ఆయన చెప్పారు.