మోత‘బడి’ | student fedaration complaint against teachers | Sakshi
Sakshi News home page

మోత‘బడి’

Nov 2 2017 7:58 AM | Updated on Nov 2 2017 7:58 AM

student fedaration complaint against teachers - Sakshi

హిందూపురం అర్బన్‌: చిన్నారులకు తరగతి గదుల్లో కూర్చోబెట్టి పాఠాలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు...వారిని కూలీలుగా మార్చారు. బకెట్లు చేతికిచ్చి కంకర, మట్టి మోపించారు. మోయలేని భారంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసిన వారు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. వివరాల్లోకి వెళితే... స్థానిక ఆబాద్‌పేటలో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రాథమికోన్నత పాఠశాలకు ఇటీవల మరమ్మతులు చేయిస్తున్నారు. అయితే బుధవారం బేల్దారులు పనికి రాకపోవడంతో అక్కడి ఉపాధ్యాయులు పాఠశాల ప్రహరీ నిర్మాణానికి అవసరమైన కంకర, మట్టిని విద్యార్థుల చేత మోపించారు.

బకెట్లలో మట్టిని నింపుకుని విద్యార్థులు బరువును మోయలేక పడిన అవస్థలు గమనించిన విద్యార్థి సంఘాల నాయకులు సంపత్, బాబావలి పాఠశాల అధ్యాపకులను నిలదీశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎంఈఓ గంగప్పకు తెలియజేయడంతో ఆయన పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పొరపాటు జరిగితే సహించేదిలేదని చెప్పారు. అయితే విద్యార్థులచేత పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిసంఘాల నాయకులు ఎంఈఓకు వినతిపత్రం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement