కృష్ణా నదిలో బోట్లు నడిపితే కఠిన చర్యలు

Strict Actions Will Take In Boating in the Krishna River Kurnool - Sakshi

సాక్షి,కర్నూలు: కృష్ణానదిలో ఇంజిన్‌ బోట్ల ప్రయాణం నిషేధమని, ఎవరైనా బోట్లు తిప్పితే కఠిన చర్యలు తప్పవని కొత్తపల్లి ఎస్‌ఐ నవీన్‌బాబు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం సంగమేశ్వరం నుంచి తెలంగాణ ప్రాంతానికి ఇంజిన్‌బోట్లు నడుపుతున్న వారికి నోటీసులు జారీ చేశారు.  ఆయన మాట్లాడుతూ అనుమతుల్లేకుండా ఎవరైనా కృష్ణానది బ్యాక్‌వాటర్‌లో ఇంజిన్‌బోట్లల్లో ప్రయాణికులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామన్నారు. అలాగే పాతసిద్ధేశ్వరం గ్రామ సమీపం నుంచి తెలంగాణ రాష్ట్రం, సోమశిల ప్రాంతానికి చెందిన ఇంజిన్‌బోట్ల నిర్వాహకులు ప్రయాణికులను తరలిస్తున్నట్లు సమాచారం ఉందని ఎస్‌ఐ తెలిపారు. పర్యాటక కేంద్రం అనుమతులు ఉన్నవారు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. 

బోట్ల నిర్వాహకులకు  నోటీసులు 
శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైలం పరిధిలోని కృష్ణానదిలో ప్రయాణికులను తీసుకెళ్లే బోట్ల యజమానులకు శ్రీశైలం సీఐ రవీంద్ర బుధవారం నోటీసులు జారీ చేశారు. ప్రతి బోటు నిర్వాహకుడు లైసెన్స్‌ కలిగి ఉండాలని, సుశిక్షులైన డ్రైవర్‌తో పాటూ సహాయకులుగా ఇద్దరు ఉండాలని, ప్రతి బోట్‌లో లైఫ్‌ జాకెట్లతో పాటూ లైఫ్‌బోట్‌ ఉండాలని నోటీసులో  పేర్కొన్నారు. నిబంధనలు పాటించని బోటు నిర్వాహకులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

కదలని ఇంజిన్‌ బోట్లు 
పగిడ్యాల: శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో అనుమతి లేకుండా ఇంజన్‌ బోట్లు తిప్పరాదని అధికారుల హెచ్చరికలతో మూర్వకొండ, ఆర్లపాడు ఘాట్లు నిర్మానుష్యంగా మారింది. ఇంజిన్‌ బోట్లను ఘాట్‌ చివర్లో రాళ్లకు కట్టి పడేశారు. కృష్ణానదికి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తున్నందున అలల ప్రభావం ఉధృతంగా కనిపిస్తోంది. అయితే మత్య్సకారులు చేపలు పట్టేందుకు నాటు పుట్టిల్లో వెళ్లి నదిలో వేట సాగిస్తున్నారు.  బుధవారం ఉదయం ముచ్చుమర్రి ఎస్‌ఐ ఏపీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ కృష్ణుడు, కానిస్టేబుల్‌ శేషారాం సింగ్‌ ఘాట్‌ను సందర్శించి ప్రయాణికులను తరలిస్తే సమాచారం ఇవ్వాలని మత్య్సకారులకు సూచించారు.  తహసీల్దార్‌ కె. శ్రీనివాసులు కూడా అర్లపాడు, మూర్వకొండ ఘాట్‌లపై ఆరా తీశారు. చదవండి : బోటును ఒడ్డుకు తీసుకురాలేం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top