కాంగ్రెస్ నేతలకు అడుగడుగునా పరాభవం | Sour Experiences to Congress Leaders in Seemandhra | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేతలకు అడుగడుగునా పరాభవం

Aug 19 2013 3:07 AM | Updated on Mar 18 2019 8:51 PM

రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు ఆ పార్టీ నేతలు ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డగిస్తున్నారు.

సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు ఆ పార్టీ నేతలు ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డగిస్తున్నారు. అధిష్టానాన్ని ఎదిరించలేని కాంగ్రెస్ నేతల నిర్వాకంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ నేతలకు ఆదివారం అడుగడుగునా పరాభవాలు ఎదురయ్యాయి. మంత్రులు కోండ్రు మురళీ మోహన్, శత్రుచర్ల విజయరామరాజు కాన్వాయ్‌లను విజయనగరం జిల్లా పూసపాటిరేగ జాతీయ రహదారి వద్ద సమైక్యవాదులు ఆదివారం అడ్డుకున్నారు. కోండ్రు మురళి విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తుండగా ఎన్‌జీఓ నేత ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో సమైక్య
 వాదులు కాన్వాయ్‌ను నిలుపుదల చేశారు. శత్రుచర్ల విజయరామరాజు శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ఎన్‌జీఓ నేతలు పూసపాటిరేగ జాతీయరహదారిపై ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
 
 పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత గానీ వారి వాహనాలు ముందుకు వెళ్లలేకపోయాయి. అనంతపురం జిల్లా గుత్తిలో గుంతకల్లు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మధుసూదన్‌గుప్తాను సమైక్యవాదులు అడ్డగించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సమైక్యాంధ్ర శిబిరానికి వచ్చిన ఎంపీ కనుమూరి  బాపిరాజును సమైక్యవాదులు చుట్టుముట్టారు. రాజీనామా చేయాలంటూ పట్టు బట్టారు. అనంతరం బాపిరాజు విలేకరులతో మాట్లాడుతూ, వెంకటేశ్వరస్వామి సాక్షిగా తెలంగాణ ప్రకటన గురించి ముందుగా తనకు తెలియదన్నారు. పాలకొల్లులో సమైక్యాంధ్ర రిలే నిరహార దీక్ష శిబిరం వద్ద ఎమ్మెల్యే ఉషారాణి  మాట్లాడుతూ, సమైక్యవాదులు కాంగ్రె స్‌పార్టీ హైకమాండ్‌ను తప్పుబట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జేఏసీ కన్వీనర్ డాక్టర్ వర్మ ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. దాంతో ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement