ఆరిన ఆశాకిరణం | soft ware employ in road accident | Sakshi
Sakshi News home page

ఆరిన ఆశాకిరణం

Jan 20 2014 4:15 AM | Updated on Oct 22 2018 7:57 PM

మారుమూల గిరిజన తండాకు చెందిన ఆ యువకుడు ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ.. ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.

ముస్తాబాద్, న్యూస్‌లైన్: మారుమూల గిరిజన తండాకు చెందిన ఆ యువకుడు ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ.. ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అవకాశం రావడంతో ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు స్నేహితుడితో కలిసి బైక్‌పై బయల్దేరాడు. కల సాకారం అవుతున్న వేళ.. లారీ రూపంలో ఎదురొచ్చిన వృుత్యువు యువకిశోరాన్ని బలిగొన్నది.
 
 ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాకు చెందిన భూక్య మోహన్‌నాయక్(23) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం వృుతి చెందాడు. గ్రామ సర్పంచ్ భూక్య మంగ్యానాయక్ కుమారుడైన మోహన్‌నాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి చదువులో ముందుంటూ.. ఉన్నతోద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగావకాశం రావడంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు.
 
 వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన బి.రాజేశ్(23) ఓయూలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరు స్నేహితులు మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం ఉదయం 9గంటలకు జరగనున్న ఇంటర్వ్యూ కోసం బైక్‌పై బయల్దేరారు.    8.45గంటలకు కొంపల్లి ఫ్లైఓవర్ సమీపంలోని ఎస్‌ఎన్‌ఆర్ గార్డెన్ ముందు నుంచి వెళ్తున్న వీరిని మేడ్చల్ నుంచి ఎదురుగా వచ్చిన రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మోహన్‌కుమార్ అక్కడికక్కడే వృుతి చెందాడు. రాజేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో పేట్ బషీరాబాద్‌లోని ఆర్‌ఆర్ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన తర్వాత కుటుంబసభ్యులు మోహన్‌కుమార్ వృుతదేహాన్ని సాయంత్రం తండాకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మోహన్‌కుమార్‌కు ఇద్దరు సోదరులున్నారు. పెద్దన్న సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తుండగా, రెండో అన్న మండలంలోని చీకోడులో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement