వ్యాపార రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగవంతమైన మార్పులు తెస్తోంది. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు ఏఐలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికాకు చెందిన క్లౌడ్ సాఫ్ట్వేర్ సంస్థ టెరాడేటా (Teradata) కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తోంది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 5,100 మంది ఉద్యోగులకు 2026 సంవత్సరంలో వార్షిక జీతాల పెంపు ఉండబోదని యాజమాన్యం ప్రకటించింది.
టెరాడేటా సంస్థ సీఈఓ స్టీవ్ మెక్మిలన్ ఉద్యోగులకు పంపిన మెమోలో, 2026 సంవత్సరానికి కంపెనీ ప్రధాన లక్ష్యం.. ఏఐ రంగంలో విజయాన్ని సాధించడం అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకోవడం, ఏఐ సామర్థ్యాలను పెంచుకోవడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పెట్టుబడులు పెట్టడం అవసరమని వివరించారు. ఈ పెట్టుబడులకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు వార్షిక జీతాల పెంపు కోసం కేటాయించిన బడ్జెట్ను ఏఐ అభివృద్ధికి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
సాధారణంగా.. కంపెనీలో ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 2 నుంచి 4 శాతం వరకు జీతాల పెంపు ఉండేది. అయితే ఈసారి ఆ పెంపులను పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికీ ఉద్యోగుల కోసం అన్ని రకాల ప్రయోజనాలను రద్దు చేయలేదని సంస్థ స్పష్టం చేసింది. పర్ఫామెన్స్ బేస్డ్ బోనస్లు, షేర్ల రూపంలో ఇచ్చే ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు కొనసాగుతాయని తెలిపింది.
టెరాడేటా మాత్రమే కాకుండా.. మరో టెక్ కంపెనీ టీటీఈసీ కూడా అమెరికాలోని ఉద్యోగుల రిటైర్మెంట్ కంట్రిబ్యూషన్ ప్రయోజనాలను 2026 వరకు నిలిపివేసింది. ఆ నిధులను ఏఐ టూల్స్, ఉద్యోగుల శిక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగింపులుపై ప్రభావం చూపిన ఏఐ, ఇప్పుడు జీతాలపైనా కూడా ప్రభావం చూపుతోంది.


