ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర రాజధాని సలహా కమిటీ త్వరలో అధ్యయనం నిమిత్తం సింగపూర్, మలేషియా వెళ్లనుంది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర రాజధాని సలహా కమిటీ త్వరలో అధ్యయనం నిమిత్తం సింగపూర్, మలేషియా వెళ్లనుంది. ఏపీ రాష్ట్ర రాజధాని సలహా కమిటీ శనివారమిక్కడ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి 9మంది కమిటీ ప్రతినిధులు, సభ్యులు హాజరయ్యారు. కాగా రాజధాని స్వభావం, స్వరూపాలు ఎలా ఉండాలన్న దానిపై ఈ భేటీలో మెకన్సీ, ఎల్అండ్టీ ప్రతినిధులు సలహా ఇచ్చారు.
ఈ భేటీ అనంతరం ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. రాజధాని అధ్యయనంపై విదేశాలకు వెళ్లే తేదీ ఇంకా ఖరారు కాలేదన్నారు. తాము రైతుల తరపున ప్రతినిధులుగా ఉంటామన్న ఆయన, రాష్ట్ర రాజధాని సలహా కమిటీలో ప్రతినిధిగా నియమించటం సంతోషకరమన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహాయం తీసుకుంటామని రాజధాని కమిటీ ఛైర్మన్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అన్ని వసతులు ఒకే చోట ఉండేలా నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమీకృత రాజధాని నిర్మాణంలో భాగస్వామి కావడానికి సింగపూర్ ముందుకు వచ్చిందని నారాయణ చెప్పారు.