సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు సాముహిక ఒక రోజు సెలవు ప్రకటించారు. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు వెళ్లే యోచనలో ఉన్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగులు నిరసనలో భాగంగా నేడు సామూహిక సెలవులు పెట్టారు. దాదాపు 2 వేల మంది ఉద్యోగులు సెలవు పెట్టి విధులు గైర్హాజయ్యారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అటెండర్ మొదలు అడిషనల్ సెక్రటరీ వరకూ నేడు సెలవు పెట్టారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సెలవులో ఉండటంతో సచివాలయం బోసిపోయింది. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు వెళ్లే యోచనలో ఉన్నారు. శనివారం లేదా సోమవారం వారు సమ్మె నోటీసు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవ్వనున్నారు.
కాగా విభజనపై జరుగుతున్న సీమాంధ్ర ఉద్యోగుల నిరసన నిన్న ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. అబిడ్స్లో బీమాభవన్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్వాదంతో పాటు ఒకరికొకరు తోపులాటలు జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.