2 నుంచి ఆమరణ దీక్షలు | second onwards initiations from the indefinite | Sakshi
Sakshi News home page

2 నుంచి ఆమరణ దీక్షలు

Sep 29 2013 5:20 AM | Updated on May 29 2018 4:06 PM

సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆమరణ దీక్షలు చేపట్టనున్నామని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకట రెడ్డి తెలిపారు.

పాణ్యం రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆమరణ దీక్షలు చేపట్టనున్నామని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకట రెడ్డి తెలిపారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ దీక్షలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోనున్నారని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన వచ్చేంత వరకు దీక్షను కొనసాగుతుందని వివరించారు. అలాగే మండల కేంద్రాల్లో వచ్చే నెల 10వ తేదీన రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. అలాగే 17వతేదీన మండల కేంద్రాల్లో ఆటో డ్రైవర్ల యూనియన్, రిక్షా యూనియన్ల ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.  మహిళలతో కలిసి 21వ తేదీన వైఎస్సార్సీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని వివరించారు.
 
 ఆయా నియోజకవర్గాల్లో సమన్వయకర్తల ఆధ్వర్యంలో  24వ తేదీన యువకులతో  బైక్‌ర్యాలీలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామాల్లో  వైఎస్సార్సీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఓడిన అభ్యర్థులు కలిసి కర్నూలులో 26వ తేదీన దీక్షలు చేపడుతారన్నారు. మండల కేంద్రాల్లో విద్యార్థులచే 29వ తేదీన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 1వ తేదీన గ్రామాల్లో సమైక్య తీర్మానాలు, పంచాయతీలు రచ్చబండ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, జననేత అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
 
 జననేతతోనే సంక్షేమం సాధ్యం.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సంక్షేమం సాధ్యమవుతుందని గౌరు వెంకటరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి భయపడి కాంగ్రెస్‌పార్టీ నాయకులకు రాజీనామాలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. తక్షణమే వారు పార్టీలకు, పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్రానికి ఇచ్చిన లేఖతోనే కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర విభజనను పూనుకున్నారని గౌరు ఆరోపించారు.
 
 ఈ పాపం ఊరుకొనే పోదని, ప్రజలు ఆయనను క్షమించబోరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున గౌరు చరితారెడ్డి పోటీ చేస్తారని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.  అందరు కలిసి కట్టుగా పని చేసి పార్టీ అభివృద్ధికి, గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌరు చరితా రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాలం చంద్రశేఖర్‌రెడ్డి, తొగర్చేడు శ్రీనివాసరెడ్డి, మద్దూరు సుధాకర్‌రెడ్డి, ఆలమూరు డెరైక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఒడ్డుగండ్ల మోహన్, గోనవరం దానం, కొండజూటూరు బోగేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement