గళం.. సమైక్యం | Samaikya Deeksha in kurnool-wide | Sakshi
Sakshi News home page

గళం.. సమైక్యం

Oct 23 2013 1:07 AM | Updated on Sep 1 2017 11:52 PM

సమైక్యాంధ్ర పరిరక్షణకు సమైక్యవాదులు కంకణబద్ధులై ముందుకు సాగుతున్నారు. విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు.

కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు సమైక్యవాదులు కంకణబద్ధులై ముందుకు సాగుతున్నారు. విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించగా.. రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కర్నూలులో భూగర్భ జలశాఖ ఉద్యోగులు ర్యాలీగా వచ్చి స్థానిక కలెక్టరేట్ ఎదుటనున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
 
 ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్‌లో రిలే దీక్షలు తిరిగి ప్రారంభించారు. డోన్ పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 83వ రోజుకు చేరుకున్నాయి. ఆదోని పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్జులు రిలే నిరాహర దీక్ష చేపట్టారు. సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకు దీక్షలు విరమించేది లేదని పట్టణ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఆత్మకూరులో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది గౌడ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు.
 
 నంద్యాలలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మునిసిపల్ టౌన్‌హాల్‌లో రైతు గర్జన నిర్వహించారు. రాష్ట్ర విభజన వల్ల రైతులకు కలిగే నష్టాలను వివరించారు. నందికొట్కూరులో కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పటేల్ సెంటర్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇక మండల కేంద్రమైన  కోసిగిలో విద్యార్థి గర్జన పెద్ద ఎత్తున నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి వేలాది విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement