
'తీర్మానం ముగిసాక రాజీనామాలు చేయొచ్చు'
అసెంబ్లీ తీర్మానం ముగిసాక రాజీనామాలు చేయడం ద్వారా విభజన తీర్మానాన్ని అడ్డుకోవచ్చని మంత్రి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: అసెంబ్లీ తీర్మానం ముగిసాక రాజీనామాలు చేయడం ద్వారా విభజన తీర్మానాన్ని అడ్డుకోవచ్చని మంత్రి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. అప్పటి వరకూ సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పదవిలో కొనసాగాలని ఆయన సూచించారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సమ్మె చేస్తున్న టీచర్లు సమ్మెను విరమించాలని శైలజానాథ్ విజ్క్షప్తి చేశారు. అసెంబ్లీ ప్రవేశపెట్టబోయే విభజన తీర్మానాన్ని అడ్డుకోవడానికి ఆ ప్రాంత ప్రతినిధులు పదవిలో కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. విభజనపై భవిష్యత్ కార్యాచరణ కోసం..అక్టోబర్ 3వ తేదీన సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ సమ్మెతో సీమాంధ్రలోని ప్రభుత్వ కార్యాలయాలన్ని మూతపడ్డాయి.గత రెండు నెలలుగా సీమాంధ్రలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యమ సెగ బాగా తాకింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెద్దలు సమ్మెను విరమించాలని సూచిస్తున్నా, ఉద్యోగులు యధావిధిగా తమ సమ్మెను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు.