
రూ.13 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్
వ్యవసాయ సుస్థిరత, స్వయంసమృద్ధి, అధికోత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం శాసన సభలో తొలిసారి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ సుస్థిరత, స్వయంసమృద్ధి, అధికోత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం శాసన సభలో తొలిసారి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2014-15 సంవత్సరానికి ప్రతిపాదించిన ఈ బడ్జెట్ మొత్తం 13,109.39 కోట్ల రూపాయలు. ఇందులో ప్రణాళిక వ్యయం కింద రూ. 6,735.44 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 6,373.95 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ మొత్తంలో రూ. 5 వేల కోట్లు రుణమాఫీకి కేటాయించారు. మిగిలిన రూ. 8 వేల కోట్లను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయించారు. ప్రస్తుతానికి రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్తో సరిపెట్టింది. భవిష్యత్లో 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని మంత్రి చెప్పారు.
అప్పుడు గొడవ చేశారే.. :సీఆర్
వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సభా నిబంధనలు అనుమతిస్తాయా? అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది అసలు బడ్జెట్ భాగమా.. ప్రభుత్వ విధాన ప్రకటన అన్నది తేల్చాలని నిలదీశారు. శుక్రవారం శాసనమండలిలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ప్రసంగానికి సిద్ధమైన సమయంలో రామచంద్రయ్య జోక్యం చేసుకుంటూ ప్రత్యేక బడ్జెట్ పేరుతో దీనిని ప్రవేశపెట్టడానికి సభా నిబంధనలు అంగీకరించవని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే.. అంచనాల కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, దీంతోపాటు సభలో కొన్ని నిబంధలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాటిని పాటించకుండా ప్రత్యేక బడ్జెట్ ను ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు.
పొంతనేది?: బొత్స
ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలకు.. బడ్జెట్ కేటాయింపులకు ఏమాత్రమూ పొంతనలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం ఆరోపించారు. వ్యవసాయ రంగం నుంచి ప్రత్యేకంగా ఆదాయం లేనప్పుడు బడ్జెట్గా ఎలా పరిగణిస్తామన్నారు. చంద్రబాబు బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టినా మొక్కుబడిగానే ఉంటుందని ఎద్దేవా చేశారు.