సమైక్య సమర వత్సవం 2013 | Roundup 2013 | Sakshi
Sakshi News home page

సమైక్య సమర వత్సవం 2013

Dec 30 2013 1:12 AM | Updated on Jun 4 2019 6:34 PM

సమైక్య సమర వత్సవం 2013 - Sakshi

సమైక్య సమర వత్సవం 2013

సమైక్య సమర వత్సరంగా 2013 ఉద్యమస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమై చరిత్రపుటగా మారుతోంది. ఊరూరా.. ఇంటింటా.. గుండెగుండెలో సమైక్య పతాకై ఎగిరింది..

సమైక్య సమర వత్సరంగా 2013  ఉద్యమస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమై చరిత్రపుటగా మారుతోంది. ఊరూరా.. ఇంటింటా.. గుండెగుండెలో సమైక్య పతాకై ఎగిరింది.. ఎగిసింది.. రహదారుల రక్తదాహానికి మాయని మరకైంది. ప్రకృతి ప్రకోపానికి, రైతన్నల కష్టనష్టాలకు మౌన సాక్షిగా నిలిచింది. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడే పార్టీ వైఎస్సార్‌సీపీనే అని చాటింది. జననేత జగన్ మాట, బాటలోనే జిల్లా జనం కదులుతున్నారని నిరూపించింది.  
 
 జనవరి
 సంక్రాంతి పండుగరోజే నగరంలో ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు ఫుట్‌పాత్‌మీద నిద్రిస్తున్న వలసకూలీలపైకి దూసుకెళ్లి ఐదుగుర్ని పొట్టనబెట్టుకుంది. ప్రజలు కావాలా, అధిష్ఠానం కావాలా తేల్చుకోవాలని సమైక్యాంధ్ర ప్రదేశ్ సదస్సులో ప్రజాప్రతినిధులను ఉద్యోగ జేఏసీ నిలదీసింది. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర మహాసభలను జస్టిస్ చలమేశ్వర్ ప్రారంభించారు. చంద్రబాబు ‘వస్తున్నా..మీ కోసం’ పాదయాత్ర చేశారు. బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య వైఎస్సార్‌సీపీలో చేరారు. తొలివిడత సహకార ఎన్నికలు జరిగాయి.
 
 ఫిబ్రవరి
 తెలుగు భాషా, చరిత్రలపై లోతైన పరిశోధన చేసిన వేటూరి ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహాన్ని ఆయన సొంతూరు పెదకళ్లేపల్లిలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఆవిష్కరించారు. సహకార ఎన్నికల్లో కేడీసీసీబీ చైర్మన్‌గా పిన్నమనేని వెంకటేశ్వరరావు గెలుపొందారు. డీసీఎంఎస్ చైర్మన్‌గా కంచి రామారావు ఎన్నికయ్యారు. విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలపై బహిరంగ విచారణను అన్ని పక్షాలు అడ్డుకున్నాయి. రాఘవులతో సహా పలువురు అరెస్టయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఎన్నార్ గెలుపొందారు. భారీ వర్షాలు జిల్లా రైతులను నట్టేట ముంచారుు.
 
 మార్చి
 వైఎస్ తనయ షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ యాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. మార్క్‌ఫెడ్ పదవి ‘కంచి’ని వరించింది. ఎడాపెడా విద్యుత్తు కోతలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, లాంతర్ల ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేసిన కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, సభకు గైర్హాజరైన చిన్నం రామకోటయ్యకు స్పీకర్ నోటీసులు జారీచేశారు. కేంద్ర హోంమంత్రి షిండే జిల్లాకు విచ్చేశారు. విజయవాడలో మహాలక్ష్మి యాగం అత్యంత వైభవంగా జరిగింది.
 
 ఏప్రిల్
 విద్యుత్తు చార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెసేతర పక్షాలన్నీ ఒకరోజు బంద్ విజయవంతంగా నిర్వహించాయి. జిల్లాలో 27రోజుల పాటు జరిగిన షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ విజయవంతంగా ముగిసింది. లయోలా కళాశాల వజ్రోత్సవాలు, ఎన్టీఆర్ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరిగాయి. గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విజయవాడ నుంచి రాత్రివేళ పునాదిపాడు వెళుతున్న అన్నా చెల్లెలిపై ఆకతాయిల దాష్టీకానికి  దళిత యువకుడు రవితేజ బలైపోయాడు. ఇంటర్ ఫలితాల్లో జిల్లా నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
 
 మే
 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 45,17,398 అని అధికారికంగా ప్రకటించారు. మండు వేసవిలో గాలివాన బీభత్సంతో మామిడి, మొక్కజొన్న రైతుకు అపార నష్టం కలిగింది. ఈ వేసవిలో అత్యధికంగా 48 డి గ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగన్ అక్రమ నిర్బంధం ఏడాదైన సందర్భంగా ప్రజాశ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు.టెన్త్ ఫలితాల్లో పదోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొండపల్లిలో జరిగిన పురా శంకుస్థాపన సభలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నగర సీపీగా బి.శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు.
 
 జూన్
 ఉత్తర కాశీ జలబీభత్సంలో జిల్లావాసులు చిక్కుకుపోయారు. మొత్తం పద్నాలుగు మంది గల్లంతయ్యారు. ఇద్దరు చనిపోయారు. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు కేంద్ర జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రాంతీయ సదస్సు విజయవాడలో జరిగింది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హాజరై దిశానిర్దేశం చేశారు. ఉత్తర కాశీ బాధితులను, వారి కుటుంబాలను ఆమె ఓదార్చారు. పారిశ్రామిక రారాజు సిరీస్ రాజు కన్నుమూశారు. ఇదే నెలలో పెనుగంచిప్రోలు తిరుపతమ్మకు వజ్రకిరీటం అలంకరించారు.
 
 జూలై
 మద్యం నూతన విధానం, కాలువలకు నీటి విడుదల జాప్యంపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఉడా చైర్మన్‌గా వణుకూరి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. జి.కొండూరులో సీఐ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ పాటించారు. పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వెంపటి చినసత్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా నగరంలో 150మంది ‘బ్రహ్మాంజలి’ నృత్య ప్రదర్శనిచ్చి అంజలి ఘటించారు. 30వ తేదీ రాత్రి రాష్ట్ర విభజన ప్రకటించడంతో సమైక్యవాదులు ఉద్యమబాట పట్టారు.
 
 ఆగస్టు
 సమైక్య ఉద్యమంతో జిల్లాలో పాలన స్తంభించింది. ఆర్టీసీ సమ్మె బాట పట్టింది. అన్ని వర్గాల ప్రజలు దీక్షలు, ధర్నాలతో తమ నిరసన వ్యక్తంచేశారు. జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు.  అవనిగడ్డ శాసనసభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్ గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ నేత వేజెండ్ల శివశంకర్ కన్నుమూశారు. కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ తనను వేధిస్తున్నారంటూ ఆయన భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
 సెప్టెంబరు
 సమైక్య గర్జనలతో జిల్లా మార్మోగింది.  నగరంలో జోరు వర్షంలో కూడా ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ  విజయవంతమైంది. జేఏసీ పిలుపు మేరకు 48గంటల బంద్ జరిపారు. షర్మిల సమైక్య శంఖారావం బస్ యాత్ర, చంద్రబాబు తెలుగు ఆత్మగౌరవ యాత్ర జిల్లాలో జరిగాయి. విద్యుత్తు ఉద్యోగులు 72గంటల సమ్మెచేశారు. వైఎస్ జగన్‌కు కోర్టు బెయిల్ ఇవ్వడంతో జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు విజయోత్సవాలు జరిపారు. నగరానికి చెందిన నీనా మిస్ అమెరికాగా నిలవడం, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరికి నగరంలో సన్మానం మరపురాని ఘట్టాలు.
 
 అక్టోబర్
 భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా ఏసీఏ ప్రధాన కార్యదర్శి గోకరాజు గంగరాజు నియమితులయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమం, వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ఉదయభాను, వంగవీటి రాధా, గౌతంరెడ్డి నిరవధిక దీక్షలు చేశారు. పై-లీన్ తుపాన్ వల్ల కురిసిన వర్షాలతో జిల్లా అతలాకుతలమైంది. పంటలు దెబ్బతిన్న రైతులను కిరణ్‌కుమార్‌రెడ్డి, విజయమ్మ, చంద్రబాబు పరామర్శించారు. విజయవాడ నగర ప్రథమ మేయర్ టి.వెంకటేశ్వరరావు కన్నుమూశారు. కలెక్టర్‌గా రఘునందనరావు బాధ్యతలు చేపట్టారు. మహబూబ్‌నగర్‌లో వోల్వో బస్సు దగ్ధమైన ఘటనలో మచిలీపట్నానికి చెందిన టక్కెళ్ల సురేష్‌బాబు మృతి చెందారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగారుు. విజయవాడ కార్పొరేషన్ కమిషనర్‌గా హరికిరణ్ నియమితులయ్యారు. గుడ్లవల్లేరు మండలం అంగలూరులోని వసతి గృహంలో విషాహారం తిని 26మంది బాలికలు అస్వస్థతకు గురయ్యూరు.
 
 నవంబర్
 రామవరప్పాడు రింగ్ బస్టాండు వద్ద ఉన్నవారిపైకి ఓ కారు దూసుకువెళ్లింది. ఓ వైద్యుడు, ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థినులు మరణించారు. పోలీసు పహరాలో రచ్చబండ కార్యక్రమాలు జరిగాయి. చిల్లకల్లు రచ్చబండలో సీఎం పాల్గొన్నారు. సమైక్య ఉద్యమం వందరోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. రైలులో వివాహితపై లైంగికదాడి కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వైఎస్సార్ సీపీ నేత కె.నాగేశ్వరరావు గుండెపోటుతో మరణించారు. హెలెన్, లెహెర్ తుపాన్లు జిల్లాను భయపెట్టాయి.
 
 డిసెంబర్
 కృష్ణానది జల వివాదంపై బ్రిజేష్ కుమార్ తీర్పును వ్యతిరేకిస్తూ పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ప్రకాశం బ్యారేజీ వద్ద చంద్రబాబు ధర్నా చేశారు. విజయవాడలో భవనం కూలి ముగ్గురు మృతిచెందారు. పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నగరంలో బహిరంగ సభ జరిపారు. ఇన్నర్‌రింగ్ రోడ్డులో భాగంగా రామవరప్పాడు రింగ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది. లాయర్ల సమైక్య శంఖారావం సభ జరిగింది. కూచిపూడిలో తానీషా నృత్యోత్సవాలు జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement