బాసరలో దొంగల బీభత్సం | Robbers attacked on woman, raped | Sakshi
Sakshi News home page

బాసరలో దొంగల బీభత్సం

Aug 18 2013 1:41 AM | Updated on Aug 30 2018 5:27 PM

ఆదిలాబాద్ జిల్లా బాసరలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దొంగల క్రూరత్వానికి బలయ్యారు.

భైంసా/బాసర, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లా బాసరలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దొంగల క్రూరత్వానికి బలయ్యారు. కత్తులతో విచక్షణారహితంగా దాడిచేయడమే కాకుండా మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు.. బాసర ఆలయం ఎదుట గల గిఫ్ట్ గ్యాలరీ షాపు యజమాని సాలిక అశోక్ శారదానగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్యా, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి దుకాణం మూసివేసి ఆయన ఇంటికి చేరుకున్నాడు. భోజనం చేశాక అందరూ నిద్రకు ఉపక్రమించారు.  దొంగల ముఠా ఇంటి వెనకాల కిటికీ గ్రిల్ తొలగించి లోనికి చొరబడ్డారు. ఒక్కసారిగా అశోక్(50), ఆయన భార్య సువర్ణ (45), పెద్ద కొడుకు మణికంఠ (25), చిన్న కొడుకు శరత్‌చంద్రలపై కత్తులతో దాడిచేశారు.

 

సువర్ణపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటనలో సువర్ణతోపాటు అశోక్, మణికంఠ అక్కడికక్కడే చనిపోయూరు. అనంతరం దొంగలు ఇంట్లోని నగలు, నగదు తీసుకొని అశోక్‌కు చెందిన కారులో పరారయ్యారు. శనివారం ఉదయం కార్పెంటర్ తలుపులను తట్టగా.. వారు ఎంతకూ తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూశాడు. రక్తపుమడుగులో ఉన్న మృతదేహాలను చూసి.. పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. నలుగురు చనిపోయారని అందరూ భావిస్తున్న తరుణంలో, శరత్‌చంద్ర బతికే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే 108లో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని యశోదకు తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement