జైల్లో హలో..హలో | roasts for nellore jail | Sakshi
Sakshi News home page

జైల్లో హలో..హలో

Jun 21 2014 3:40 AM | Updated on Sep 2 2017 9:07 AM

చెముడుగుంటలోని జిల్లా కేంద్రకారాగారంలో ఉంటున్న ఖైదీలకు ఫోన్ సౌకర్యాన్ని జైళ్లశాఖ ఐజీ బి.సునీల్‌కుమార్ శుక్రవారం ప్రారంభించారు.

ఖైదీలకు ఫోన్ సౌకర్యం
 
నెల్లూరు(క్రైమ్) : చెముడుగుంటలోని జిల్లా కేంద్రకారాగారంలో ఉంటున్న ఖైదీలకు ఫోన్ సౌకర్యాన్ని జైళ్లశాఖ ఐజీ బి.సునీల్‌కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఖైదీల్లో మానిసిక బాధను తగ్గించడంతో పాటు మానసిక పరివర్తన పెంపొందించేందుకు ఈ సౌకర్యం దోహదపడుతుందన్నారు. వొడాఫోన్ నెట్‌వర్క్‌తో ఒప్పందం ఏర్పాటు చేసుకుని రెండు ల్యాండ్‌లైన్లను కారాగారంలో ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఖైదీ నెలకు ఎనిమిదిసార్లు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుకోవచ్చన్నారు. ఖైదీలు తాము మాట్లాడే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫోను నంబర్లను జైలు సిబ్బందికి అందించాలన్నారు. వారు ఆ  నంబర్లను రిజిస్టర్ చేసుకుంటారన్నారు. ఖైదీలు మాట్లాడే ప్రతి మాటా ఆటోమెటిక్‌గా రికార్డు అవుతుందన్నారు. ఇప్పటికే చర్లపల్లి, చెంచల్‌గూడ, రాజమండ్రితో పాటు పలు కేంద్ర కారాగారాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనంతరం ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ సౌకర్యం కల్పించడంపై ఖైదీలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కారాగారంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు.

త్వరలోనే ఆ శాఖ డీజీ కృష్ణంరాజు పర్యటన ఉన్న దృష్ట్యా పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచిం చారు. ఖైదీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి ఆయన పాతజైలును సందర్శించారు. పాతజైలును త్వరలోనే సీకా (స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్)గా మార్చనున్నారు.  ఆంధ్రరాష్ట్రంలోని జైలుశాఖ అధికారులకు, సిబ్బందికి ఇకపై నెల్లూరులోని సికాలో  శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అంశాలపై ఆయన జైలు సూపరింటెండెంట్ ఎంఆర్ రవికిరణ్‌తో మాట్లాడారు.  ఐజీ పర్యటన ఆద్యంతం గోప్యంగా సాగింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement