సాక్షి సంగారెడ్డి : మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి సంగారెడ్డి జైల్లో పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇటీవల జరిగిన మెదక్ మున్సిపల్ ఎన్నికల ఘర్షణలో అరెస్ట్ అయి కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 13మంది BRS కార్యకర్తలతో హరీష్ రావు ములాఖత్ అయ్యారు.
మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక అక్రమంగా కార్యకర్తలను కారాగారానికి తరలించారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఒక సీటు ఎక్కువే గెలిచిందని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ 15వ వార్డుకు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. మెదక్ డీఎస్పీ దగ్గరుండి కాంగ్రెస్ కార్యకర్తలతో డబ్బులు పంచే ప్రయత్నం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. కనుక కేసులు పెట్టాల్సింది ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులపై కానీ అన్యాయాన్ని ప్రశ్నించిన BRS నాయకులపై కాదన్నారు.
ఆరుగురు ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఇది అత్యంత దారుణమన్నారు. పోలీసులు గుడ్డిగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా పోలీసులు వ్యవహరిస్తే రేపు మిమ్మల్ని సైతం శిక్షించక తప్పదని హరీశ్ రావు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. మెదక్ లో కాంగ్రెస్ గుండాలు BRS కార్యకర్తలని బెదిరిస్తున్నారని మెదక్ లో గుండాల రాజ్యం నడుస్తోందా? లేక ప్రభుత్వ పాలన నడుస్తోందా అని అడిగారు.
పోలీసులు కేసులు పెట్టేటప్పడు ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని కేసులు పెట్టాలని తెలిపారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్ ని తిడితే కేసు ఎందుకు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతారు. ఆయనకు ఇది కనబడడం లేదా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో 800 స్థానాలను BRS గెలిచిందని ఆనాడు BRS అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కనీసం నాలుగు స్థానాలను సైతం గెలవలేదని అన్నారు. రైతు బంధు ఇంకా ఎప్పుడు వేస్తావో రేవంత్ రెడ్డి తెలపాలని అది ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేయడం తప్పదని హరీశ్ రావు అన్నారు.


