రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరిగినా ఆ దృశ్యాలను ఫొటోలు తీసి.. రోడ్డు భద్రత యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని పోలీసు అధికారులను డీజీపీ సాంబశివరావు ఆదేశించారు.
– అప్లోడ్ చేయాలని పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశం
కర్నూలు: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరిగినా ఆ దృశ్యాలను ఫొటోలు తీసి.. రోడ్డు భద్రత యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని పోలీసు అధికారులను డీజీపీ సాంబశివరావు ఆదేశించారు. బుధవారం ఉదయం విజయవాడ నుంచి అన్ని జిల్లాల పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి రాయలసీమ ఐజీ శ్రీధర్రావు, ఎస్పీ ఆకె రవికృష్ణ, అడిషనల్ ఎస్పీ షేక్షావలీ హాజరయ్యారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ..వాహనాలను రాంగ్ రూట్లో నడపడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు.
జిల్లాల వారీగా రోడ్డు ప్రమాదాల సమచారాన్ని అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల్లోని హాస్పిటల్స్ ఫోన్ నంబర్లు పోలీసు సిబ్బంది కలిగి ఉండాలన్నారు. కొత్తగా ఎంపికైన ఎస్ఐలు శిక్షణకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని చెక్పోస్టుల సమాచారం అందజేయాలన్నారు. డీఎస్పీ రమణమూర్తి, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు మహేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, డేగల ప్రభాకర్, సుబ్రమణ్యం, ఆదిలక్ష్మీ, రామాంజనేయులు (కమ్యూనికేషన్), ఆర్ఐలు రంగముని, జార్జ్, రామకృష్ణ, ఈ.కాప్స్ ఇంచార్జి రాఘవరెడ్డి, డీఐజీ సీసీ నారాయణ, డీసీఆర్బీ ఎస్ఐ పులిశేఖర్, ఈ.కాప్స్ సిబ్బంది పాల్గొన్నారు.