
నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా!
ఎవరు అవునన్నా... కాదన్నా సరే... ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. గోదావరిఖని సమీపంలోని ఎల్లంపల్లి వద్ద జనవరి 5న సీఎం కిరణ్కుమార్రెడ్డి ఈ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తారు.
ఎవరు అవునన్నా... కాదన్నా సరే... ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. గోదావరిఖని సమీపంలోని ఎల్లంపల్లి వద్ద జనవరి 5న సీఎం కిరణ్కుమార్రెడ్డి ఈ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తారు. ఈ మేరకు సీఎం కార్యాలయం షెడ్యూలును సిద్ధం చేసింది.
ఇప్పటికే రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ సంబంధిత ఆహ్వాన లేఖలను, ప్రాజెక్టు ముఖ్యాంశాలకు సంబంధించిన బ్రోచర్లను ముద్రించింది. బ్యారేజీ సమీపంలో పైలాన్ నిర్మిస్తోంది. జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులెవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ఏర్పాట్లన్నీ చేస్తోంది. దీంతో ఎల్లంపల్లి ప్రారంభోత్సవం మంత్రి శ్రీధర్బాబుతో పాటు జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్యులను కలవరపెడుతోంది. కనీసం తమతో సంప్రదించకుండా సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం... అధికారులతో చకచకా ఏర్పాట్లు చేయిస్తున్న తీరు చూసి ఆందోళన చెందుతున్నారు.
- సాక్షి ప్రతినిధి, కరీంనగర్
రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ఈ భారీ ప్రాజెక్టు తన చేతుల మీదుగా ప్రారంభమైందని చెప్పుకోవాలని తాపత్రయమో...? లేదా తెలంగాణలోని పార్టీ నేతలు చెప్పిన మాట పెడచెవిన పెట్టాలనుకున్నారో...? కారణమేదైనా ఈ ప్రాజెక్టును ప్రారంభం చేయాలని సీఎం పట్టుదలతో ఉన్నట్లు అటు రాజకీయ నేతల్లో.. ఇటు ఇరిగేషన్ విభాగం ఉన్నతాధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే షెడ్యూలు అంతా ఖరారయ్యాక ‘సార్... సీఎం గారు 5వ తేదీన వస్తున్నా రు. ఎల్లంపల్లి ప్రారంభోత్సవం చేస్తారు. ఆహ్వా న పత్రికలు పంపించారు...’ అంటూ ప్రాజెక్టు ఇంజినీర్ల ద్వారా శుక్రవారం మంత్రి శ్రీధర్బాబుకు సమాచారం అందించినట్లు తెలిసింది. ‘ఇప్పట్లో వద్దని చెప్పాం. ప్రారంభోత్సవానికి తొందర ఎందుకు..? కనీసం మాతో సంప్రదించకుండా పర్యటన ఎలా ఖరారైంది.. స్థానికంగా మాకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలోకి తీసుకోవద్దా.. ఒకవైపు తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ఉంటే ఇప్పుడీ ప్రాజెక్టు ప్రారంభోత్సమెందుకు...?’ అంటూ మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కానీ.. ప్రిన్సిపల్ సె క్రటరీ, సీఎం కార్యాలయం నుంచి ఒత్తిడి మేరకు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని ఇంజినీర్లు అసలు విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. చివరకు... సీఎం కరీంనగర్ జిల్లాలో అడుగు పెట్టకుండా, ఆదిలాబాద్ మీదుగా వచ్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశమేమైనా ఉందా..? అని మంత్రి ఇంజినీర్లను ఆరా తీసినట్లు తెలిసింది. బ్యారేజీ, గేట్లు, సిస్టర్న్.. అన్నీ రామగుండం మండలం ఎల్లంపల్లి వైపే ఉన్నాయని, గోదావరికి ఎడమ గట్టున ఉన్న ఆదిలాబాద్లో అలాంటి ఛాన్స్ లేదని... జిల్లాలోనే ప్రారంభం చేయాల్సి ఉంటుందని ఇంజినీర్లు బదులిచ్చినట్లు సమాచారం.
దీంతో ఆయన వస్తానంటే... వద్దంటామా... అన్నట్లుగా మంత్రి ‘ఏర్పాట్లు బాగా చేయండి. రెండ్రోజుల తర్వాత అటువైపు వచ్చి పరిశీలిస్తాను...’ అని ఇంజినీర్లను పంపిం చినట్లు తెలిసింది. దీంతో సీఎం రాకకు జిల్లా నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వ్యతిరేకిస్తున్న సీఎంపై విపక్షాలు అవకాశం దొరికినప్పుడల్లా దుమ్మెత్తి పోస్తున్నాయి. మరోవైపు ముంపు బాధితులకు పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు ఎలా ప్రారంభిస్తారని నిలదీస్తున్నాయి.
పనులు అసంపూర్తి గా ఉన్నాయని, ముంపు బాధితులకు పరిహారం ఇవ్వకుండా, వారిని పునరావాస కాలనీలకు తరలించకుండా ప్రారంభోత్సవం జరిపితే అడ్డుకుంటామని సీపీఐ బహిరంగంగా అల్టిమేటమ్ జారీ చేసింది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులను పరిశీలించిన ఆ పార్టీ నేతలు గుండా మల్లేశ్, చాడ వెంకట్రెడ్డి సీఎం, మంత్రిపై ధ్వజమెత్తారు. ఎన్నికలు సమీపిస్తున్నందున తన నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటిని అందించేందుకు మంత్రి శ్రీధర్బాబు ప్రారంభోత్సవానికి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో సీఎం షెడ్యూలు ఖరారవడం కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారనుంది.