పింఛను బకాయిలు వచ్చాయేమో తెలుసుకునేందుకు సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన ఓ విశ్రాంత ఉద్యోగి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
జగ్గయ్యపేట :మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ బకాయిలు వచ్చాయేమో తెలుసుకునేందుకు సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన ఓ విశ్రాంత ఉద్యోగి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ ఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జగ్గయ్యపేటలోని కాగితాల బజారుకు చెందిన వేముల సీతారామరావు (విశ్రాంత గ్రామాభివృద్ధి అధికారి) సోమవారం ఉదయం సబ్ట్రెజరీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడున్న సిబ్బందిని తన పింఛను బకాయిల గురించి విచారిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సిబ్బంది వెంటనే 108కు సమాచారం అందించి ఆయన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే సీతారామరావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కాగా తన భర్త మరణానికి ప్రభుత్వ సిబ్బంది తీరే కారణమని సీతారామరావు భార్య అన్నపూర్ణ ఆరోపించారు. అనారోగ్యంతో చికిత్స చేయించుకోగా, దానికి సంబంధించి మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ కోసం నెలరోజులుగా తన భర్త ఎండీవో, ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, వెంటనే మంజూరు చేయకుండా తిప్పించుకోవడంతో ఆయన మానసిక వేదనకు లోనవడం వల్లే హఠాన్మరణం చెందినట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.