వికలాంగులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని అదనపు జాయింట్ కలెక్టర్ రామస్వామి అన్నారు. కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేదికపై ఆయన మాట్లాడారు.
కర్నూలు అగ్రికల్చర్ : వికలాంగులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని అదనపు జాయింట్ కలెక్టర్ రామస్వామి అన్నారు. కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేదికపై ఆయన మాట్లాడారు. వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వికలాంగులందరూ విధిగా సదరం ధ్రువపత్రాలు పొందినప్పుడే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. సదరమ్ క్యాంపుల్లో జాప్యం లేకుండా ధ్రువపత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగాలని కోరారు. వికలాంగులకు ఉచిత న్యాయాన్ని అందించేందుకు, ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించడంతో పాటు కోర్టు ఫీజులు కూడా చెల్లిస్తున్నామని జిల్లా న్యాయ సేవా సంస్థ జడ్జి ఆదినారాయణ తెలి పారు.
వికలాంగులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. వికలాంగులు అన్యాయానికి గురికాకూడదనే ఉద్దేశంతోనే ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు వివరించారు. వికలాంగుల శాఖ ఏడీ వరప్రసాద్, మెప్మా పీడీ రామాంజనేయులు మాట్లాడారు. అనంతరం ముగ్గురికి వివాహ ప్రోత్సాహకంగా రూ.50 వేలు ప్రకారం ఏజేసీ రామస్వామి అందజేశారు. ఐదుగురు వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వికలాంగుల సంఘాల నేతలు పాల్గొన్నారు. బధిరులు, అంధులు, శారీరక వికలాంగుల సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
భారీ ర్యాలీ
అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు వికలాంగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం వికలాంగుల సంక్షేమ శాఖ, డీఆర్డీఏ-వెలుగు, మెప్మా, సర్వశిక్ష అభియాన్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్వహించిన వికలాంగుల సాంస్కృతిక కార్యక్రమాలు అదుర్స్ అన్పించాయి.