గజరాజులకు గూడు.!

Rehabilitation Of Elephants In Dokiseela Vizianagaram District - Sakshi

డోకిశిలలో 526 హెక్టార్లలో  పునరావాసం

అటవీ అధికారుల ముమ్మర ఏర్పాట్లు

ప్రస్తుతం రెండు జిల్లాల్లో ఉన్నవి 10 ఏనుగులు

నేడు పరిశీలనకు వస్తున్న పీసీసీఎఫ్‌  నళినీమోహన్‌

జిల్లాలో ఏనుగుల బెడద   నుంచి ఇక ఉపశమనం

ఎప్పుడు ఏ ప్రాంతానికొచ్చేస్తాయో... ఎవరి పంటలు నాశనం చేసేస్తాయో తెలియదు. ఒక రోజు... ఒక పక్షం... ఒక నెల కాదు...  ఏడాదిగా అను నిత్యం అనుభవిస్తున్న నరక యాతన. కురుపాం నియోజకవర్గ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల బెడద నుంచి ఇక ఉపశమనం కలగనుంది. ఎట్టకేలకు వాటికి పునరావాసం కల్పించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే పార్వతీపురం మండలం డోకిశిలలో 526 హెక్టార్ల భూమిని పరిశీలించారు. అక్కడ వాటికోసం సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సంచరిస్తున్న పది ఏనుగులకు అక్కడ నివాసం కల్పించనున్నారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా సరిహద్దుల్లో సంచరిస్తున్న ఆరు ఏనుగులతో పాటు, శ్రీకాకుళం అడవుల్లో నివాసం ఏర్పరచుకున్న నాలుగు ఏనుగులకు ఇకపై విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మండలం డోకశిల ప్రాంతంలో గూడు లభించనుంది. జిల్లాలో కొన్నేళ్లుగా ఏనుగులు సంచరిస్తూ పంటలు నాశనం చేయడమే కాకుండా మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటివరకూ ఏనుగులు ముగ్గురిని బలిగొన్నాయి. నాలుగు నెలల్లో ఇద్దరిని గాయపరిచాయి. వందలాది ఎకరాల్లో పంటలు నాశనం చేస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌ 7వ తేదీన జిల్లాలో ప్రవేశించిన ఏనుగులు అదే ఏడాది ఒకరిని, ఈ ఏడాది జనవరిలో మరొకరిని బలిగొన్నాయి.

శ్రీకాకుళం జిల్లా, ఒడిశా ప్రాంతాల నుంచి ఏనుగులు విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం, సాలూరు గిరిజన ప్రాంతా ల్లోకి ప్రవేశిస్తున్నాయి. గిరిజనులు కొండ చరియల ప్రాంతంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి పంటలను సాగుచేస్తున్నారు. జిల్లాలోని కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో అంకుళవలస, సుందరావువలస, కుమ్మరిగుంట, ఆర్తాం, సోమినాయుడు వలస, గుణానవలస, కుండతిరువాడ, నీచుకవలస, ఆర్నాడ గ్రామాల్లో పంటల్ని ఈ ఏనుగులు తీవ్రంగా నష్టపరిచాయి. 1368 ఎకరాల్లో వరి, చెరకు, అరటి, టమాట పంటలు వీటి దాడిలో దెబ్బతిన్నాయి. 1138 మంది రైతులు ఏనుగుల సంచారం వల్ల రూ.89.50 లక్షల విలువైన పంటలు నష్టపోయారు.

తొమ్మిదేళ్ల క్రితం కూడా బీభత్సం..
పార్వతీపురం మండలంలోని ఎర్రసామంతవలస, పిట్టలవలస, ప్రాంతాల్లో 2016లో ఏనుగులు సంచరించాయి. 2007 సంవత్సరంలో కూడా ఏనుగులు జిల్లాలో ప్రవేశించి ఆస్తి, ప్రాణనష్టం కలిగించాయి. అప్పట్లో జియ్యమ్మవలస మండలానికి చెందిన ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాయి. అప్పట్లో ఒక ఏనుగును చంపేశారు. ఏడాదిగా అనేక మందిని గాయపరిచాయి. ప్రస్తుతం గరుగుబిల్లి మండలంలో తిష్టవేశాయి. ఒడిశా సరిహద్దువైపు వెళుతున్నాయి.  ఏనుగుల సంచారంతో విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా, ఒడిశా రాష్ట్ర ప్రజలు కూడా భయాందోళనలో బతుకుతున్నారు. గతంలో ఏనుగులు విరుచుకుపడినప్పుడు ఆపరేషన్‌ జయంతి, అపరేషన్‌ గజ పేరున రెండు ఏనుగులను రప్పించారు. నాలుగు ఏనుగులను లారీలపై ఎక్కించి ఒడిశా రాష్ట్రంలోని లఖేరీ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు యత్నించిన క్రమంలో ఓ ఏనుగు మరణించడంతో జంతుసంరక్షణ కమిటీ  అభ్యంతరం తెలిపింది. దాంతో ఆ ఆపరేషన్‌ ఆగిపోయింది. తరువాత ఈ ప్రాంతానికి వచ్చిన గుంపులో ఓ గున్న ఏనుగు గతేడాది విద్యుదాఘాతంతో మృత్యువాతపడగా... ఈ ఏడాది జనవరిలో గుంపు నుంచి తప్పిపోయిన ఒక ఏనుగు నాగావళి నదిలో శవమై తేలింది.

ఎలిఫెంట్‌ జోన్‌కు గిరిజనుల వ్యతిరేకం..
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలిఫెంట్‌ జోన్లు ఏర్పాటుచేసి ఏనుగులకు అవసరమైన ఆహారం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలనే ప్రతిపాదనలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే అడవినే నమ్ముకుని బతుకుతున్న గిరి జనులు ఈ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గిరిజనుల భయాం దోళనలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతిపదికన ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పక్కనపెట్టి ఏనుగుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించా రు. సాలూరు అటవీ రేంజ్‌ పరిధిలోని డోకశిల ప్రాంతాన్ని దీనికోసం ఎంపిక చేశారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్య అటవీ సంరక్షణ అధికారి నళినీమోహన్‌ సోమవారం విజయనగరం జిల్లాకు వస్తున్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విజయనగరంలో జిల్లా అటవీ శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన డోకశిల ప్రాంతానికి వెళతారు.

పునరావాసంతో తీరనున్న బెడద..
ఎన్ని ప్రయత్నాలు చేసినా జిల్లాలో ఏడాదిగా ఏనుగుల బెడద తొలగడం లేదు. రోజూ 40 మంది ఎలిఫెంట్‌ ట్రాకర్లు శ్రమిస్తుండటం వల్ల ప్రాణ నష్టం లేకుండా చేయగలుగుతున్నాం. ఈ నేపథ్యంలో డోకశిల ప్రాంతంలో ఏనుగుల పునరావాస కేంద్రాన్ని 1315 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రాంతం చుట్టూ ఏనుగుల సంచారానికి, నివాసానికి అనుకూల పరిస్థితులు కల్పిస్తాం. అలాగే అవి బయటకు రాకుండా తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తాం. ఇద్దరు వెటర్నరీ డాక్టర్లను నియమిస్తాం. గడ్డి విత్తనాలు జల్లి గడ్డి మొలిపిం చడంతో పాటు నీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతాం. దీనివల్ల స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగదు.
– గంపా లక్ష్మణ్, డీఎఫ్‌ఓ 
(టెరిటోరియల్‌), విజయనగరం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top