వన్యప్రాణుల పట్ల తనకున్న అమితమైన ప్రేమను అనంత్ అంబానీ మరోసారి చాటుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు రాజస్థాన్ రాజధాని జైపూర్ శివార్లలోని హాథీ గావ్లో జరిగాయి. మూగజీవాల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా స్థానిక ‘హాథీ గావ్ వికాస్ సమితి’ ఈ వినూత్న వేడుకను నిర్వహించింది.
ఈ వేడుకలో ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన భారీ ‘ఫ్రూట్ బఫే’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుమారు 3,000 కిలోల బరువున్న వివిధ రకాల పండ్లను ఏనుగులకు విందుగా వడ్డించారు. ఈ బఫేలో అరటిపండ్లు, యాపిల్స్, పుచ్చకాయ, బొప్పాయి, నారింజ వంటి కాలానుగుణ ఫలాలతో పాటు ఏనుగులకు ఇష్టమైన చెరకు, బెల్లం, పచ్చి పశుగ్రాసాన్ని భారీగా సిద్ధం చేశారు. రాజస్థానీ సాంప్రదాయ శైలిలో అలంకరించిన గజరాజులు ఈ విందును ఆస్వాదించాయి.
మావత్ కుటుంబాలకు అండగా..
వన్యప్రాణుల సంరక్షణలో కీలక పాత్ర పోషించే మావత్ (ఏనుగుల సంరక్షకులు)లను ఈ సందర్భంగా సమితి గౌరవించింది. ఏనుగుల సంక్షేమం కోసం శ్రమించే వారికి నిత్యావసర వస్తువులతో కూడిన రేషన్ కిట్లు, దుస్తులు, టోపీలు, పాదరక్షలు, రోజువారీ వినియోగ వస్తువులను పంపిణీ చేశారు.
అనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3,500 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి వన్యప్రాణి పునరావాస కేంద్రం వంతారాను స్థాపించిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో వేధింపులకు గురైన, అనారోగ్యంతో ఉన్న సుమారు 200 జాతులకు చెందిన జంతువులకు వంతారాలో ఆశ్రయం కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లోని ఏనుగుల సంరక్షణకు ఆయన అందిస్తున్న ఆర్థిక సాయం పట్ల స్ఫూర్తి పొంది ఈ వేడుకను నిర్వహించినట్లు హాథీ గావ్ వికాస్ సమితి అధ్యక్షుడు షఫీక్ బల్లు ఖాన్ తెలిపారు.
ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ?


