గజేంద్ర ‘మోక్షం’ | Sakshi Editorial On Elephants in forests of Chhattisgarh Issue | Sakshi
Sakshi News home page

గజేంద్ర ‘మోక్షం’

Feb 16 2026 1:01 AM | Updated on Feb 16 2026 1:01 AM

Sakshi Editorial On Elephants in forests of Chhattisgarh Issue

‘ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపలనుండు లీనమై’ అనే పోతన గారి పద్యం సుప్రసిద్ధం. ఇప్పటి సంగతేమో కానీ, ఇటీవలి వరకూ ఈ పద్యం విననివారు ఉండరు. దాని వెనక కథేమిటంటే, ఓ ఏనుగు మడుగులోకి దిగింది. ఓ మొసలి దాని కాలు పట్టు కుంది. విడిపించుకోడానికి ఏనుగు హోరాహోరీ పోరాడింది. ఆ పోరాటం ఏళ్ళ తరబడి సాగింది. ప్రాణం కడతేరే దశలో ఏనుగు ఈశ్వరునికి మొర పెట్టుకుంది. ఆ క్రమంలో ఏకంగా విశ్వమూలాల్లోకి వెళ్ళిపోయింది; ఈ జగత్తు ఎవరివల్ల పుట్టిందో, ఎవరిలో ఉంటుందో, ఎవరిలో లయమైపోతుందో, పరమేశ్వరుడెవరో, అనాది మధ్య లయుడెవరో, అంతా తనే అయినవాడెవరో– అతని నుంచి పుట్టిన ఈశ్వరుని శరణువేడుకుంటు న్నానంటుంది. అప్పుడు ఈశ్వరుడు వచ్చి మొసలిని చంపి ఏనుగును రక్షిస్తాడు! 

ఈ క్షణాన ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఏనుగులు ఇలాగే మొరపెట్టుకుంటున్నాయి; ఈసారి అక్కడి అటవీ గ్రామాల వాళ్ళు కూడా ఆ మొరలో గొంతు కలుపుతున్నారు. మనుషులకీ, ఏనుగులకీ మధ్య అక్కడ పతాక స్థాయిలో జీవన సమరం జరుగుతోంది. ఉభయులనూ రక్షించగల ఈశ్వరుడే కనుచూపు మేరలో కానరావడం లేదు. గత పన్నెండేళ్ళలోనే 68 ఏనుగులతోపాటు, 698 మంది మనుషులు మరణించారు. కొద్దిరోజుల క్రితమే ఓ 70 ఏళ్ళ వృద్ధుని ఏనుగులు తొక్కి చంపేశాయి. భారత వన్యప్రాణి సంస్థవారూ, జంతు సంక్షేమ సంఘం వారూ రంగంలోకి దిగి చేస్తున్న రోదనలు అక్షరాలా అరణ్యరోదనే అయి నట్టు కనిపిస్తున్నాయి.   

మరీ క్రూర జంతువులను మినహాయిస్తే, ఏనుగులు సహా వన్యప్రాణులతో మనిషి సహజీవనం చేయని దశ చరిత్రలో కనిపించదు. ఇప్పుడు సహజీవనం చేయలేని దశకు చేరుకున్నాడు. అందుకు తనే బాధ్యుడు తప్ప వన్యప్రాణులు కావు. ఈ భూమండలం మీద జీవించే హక్కు అన్ని ప్రాణులకూ ఉన్న సంగతి మరచిపోయి తన సర్వం సహాధిప త్యాన్ని స్థాపించుకోడానికి పూనుకున్నాడు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నరికేసి జనావాసాలను సృష్టిస్తున్నాడు, గనులు తవ్వేస్తున్నాడు, అడవుల్లో ఎక్కడబడితే అక్కడ విద్యుత్తంత్రులను వేలాడదీస్తున్నాడు. 

దాంతో వన్యప్రాణులకు సంచార భూమి కుదించుకుపోయి ఊళ్ళమీద పడుతున్నాయి. ఇటీవలి వరకూ ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఏనుగుల సంఖ్య నామమాత్రం. ఇప్పుడు మూడు వంతుల మేరకు, అంటే దాదాపు 400కు వాటి సంఖ్య పెరిగిపోయింది. అభివృద్ధి పేరిట జరుగుతున్న తవ్వకాల వల్ల అలవాటుపడిన దారులు మరచిపోయి అవి జనావాసాల్లోకి వచ్చిపడుతున్నాయి. 90 శాతం ఏనుగుల మరణానికి విద్యుదాఘాతాలే కారణమంటున్నారు. ఆ పైన గోతులు, బురద నేలలు వాటి ప్రాణాలు హరిస్తున్నాయి. 

అడవి జంతువులను మచ్చిక చేసుకుని వాడుకోవడంలో ఎంతో తెలివి కనబరచిన మనిషి, చివరికి వాటితోనే పోరాడి ప్రాణాల మీదికి తెచ్చుకునే తెలివి హీనతకు దిగ జారడం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వార్థం వికటించి ప్రకృతి విధించిన అన్ని రకాల హద్దులనూ, సహజీవన ధర్మాన్నీ ఉల్లంఘించడమే అందుకు కారణం. పురాణ, ఇతిహాస కాలంతో మొదలుపెట్టి, చరిత్ర కాలం వరకూ మనిషికీ, ఏనుగుకీ ఉన్న అనుబంధం అనేక రూపాల్లో అక్షరబద్ధమైంది. ఏనుగు ముఖంతో ఉన్న గణపతిని కొలవడం సరేసరి; ‘ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవు’డని పిల్లలు పాడుకోవడం మనకు తెలుసు. 

ధర్మరాజు వాకిట్లో ఏనుగుల నుంచి స్రవించే మదం బురద కట్టగా, కిక్కిరిసిన సామంత రాజులు ధరించిన ఆభరణాల నుంచి జారిన రజం ఆ బురదను కప్పేసిందంటూ ధర్మరాజు గజ సంపదనూ, సామంత రాజుల బలగాన్నీ కూడా – ‘ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు’ అనే పద్యంలో అద్భుతంగా వర్ణిస్తాడు తిక్కన. యుద్ధంలో ఓడిన తర్వాత, ఏనుగునెక్కి, రెండు వైపులా అనేక ఏనుగులు వెంట రాగా పురవీథుల్లో ఎలా విహరించగలవంటూ, చక్కని మరో తిక్కన పద్యంలో అర్జునుడు దుర్యోధనుని ఆక్షేపిస్తాడు. ‘ఏనుగునెక్కినాము ధరణీంద్రులు మొక్కగ నిక్కినాము’ అంటూ తిరుపతి వెంకటకవులు సగర్వంగా చెప్పుకుంటారు. ఏనుగునెక్కి యుద్ధాలు చేసిన మనిషి ఏనుగుతో యుద్ధం చేయవలసి రావడమే అతని వివేక భ్రష్టతకు పరాకాష్ఠ. ఛత్తీస్‌గఢ్‌ అడవులు ఘోషిస్తున్న సత్యం అదే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement