జీజీహెచ్‌లో ఎలుకల వేట | Rats Hunting In GGH | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో ఎలుకల వేట

Mar 27 2018 8:04 AM | Updated on Mar 27 2018 8:04 AM

Rats Hunting In GGH - Sakshi

జీజీహెచ్‌లో సోమవారం పట్టుబడ్డ ఎలుకలతో సిబ్బంది

గుంటూరు మెడికల్‌: మీరు జీజీహెచ్‌కు చికిత్స కోసం వెళుతున్నారా.. అయితే ఎలుకలు ఉంటాయన్న విషయం గమనించి జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఎలుకలు దాడి చేసే ప్రమాదం ఉంది. సోమవారం ఒక్క రోజే 11 ఎలుకలు ఆస్పత్రిలో పట్టుబడ్డాయి. రోజురోజుకు ఎలుకలు పెరిగిపోతున్నాయి తప్ప, తగ్గడం లేదు. ఎలుకల నివారణ చర్యలు తీసుకుంటున్నామన్న ఆస్పత్రి అధికారుల మాటలు నీటిమూటలుగానే ఉంటున్నాయి. ప్రతిరోజూ వివిధ వార్డుల్లో అధిక మొత్తంలో పట్టుబడుతున్న ఎలుకలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రెండు నెలల కిందట సాక్షాత్తు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చికిత్స అందిం చే క్యాన్సర్‌ వైద్య విభాగంలోనే ఎలుకలు కరిచాయంటూ రోగులు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదులు అధికారులకు చేరుతున్నా నివారణ చర్యలు మాత్రం తూతూమంత్రంగా ఉంటున్నాయే తప్ప, ఎలుకల నిర్మూలనకు శాశ్వత పరిష్కారాన్ని అధికారులు చూపించలేకపోతున్నారు. దీంతో వార్డుల్లో ఉంటున్న రోగులు అప్పుడప్పుడు ఎలుకల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు.

కొనసాగుతున్న వేట..
గుంటూరు జీజీహెచ్‌లో 2015 ఆగస్టులో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిం చింది. దీంతో ప్రభుత్వం శానిటేషన్‌పై దృష్టి సారించి అధిక మొత్తంలో బడ్జెట్‌లు కేటా యించింది. అప్పటి వరకు శానిటేషన్, ఫెస్ట్‌ కంట్రోల్, సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతలు కేవలం ఒకేఒక్క కాంట్రాక్టర్‌కు ఉండటం తో, నూతన శానిటేషన్‌ పాలసీలో భాగంగా ఒక్కో బాధ్యతను ఒక్కో కాంట్రాక్టర్‌కు అప్పగించింది.

కాంట్రాక్టర్లకు బడ్జెట్‌లు పెంచినా, బాధ్యతలు తగ్గించినా పనితీరులో మాత్రం మార్పు రాలేదనే దానికి ప్రతిరోజూ ఆస్పత్రిలో పట్టుబడుతున్న ఎలు కలే నిదర్శనం.  అయినప్పటికీ ఆస్పత్రి అధికారులు పెస్ట్‌ కంట్రోల్‌ కాంట్రాక్టర్‌కు పనితీరు బాగుం దంటూ ఎక్కువ మార్కులు వేస్తూ అధిక మొత్తంలో అతనికి నిధులు వచ్చేలా చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కాగా ఫెస్ట్‌ కంట్రోల్‌ సిబ్బందికి రెండేళ్లుగా వేతనాలు పెంచకుండా, పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించకుండా, సిబ్బంది వేతనాల్లో మాత్రం కోత కోస్తున్నారనే ఫిర్యాదులు    వినిపిస్తున్నాయి.ఆస్పత్రి అధికారులు ఇకనైనా స్పందించి ఆస్పత్రిలో ఎలుకల నిర్మూలన చర్యలను చిత్తశుద్ధితో నిర్వహించేలా చూడాలని రోగులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement